హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎజెండాతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మం సభతో ఆ పార్టీలకు కండ్లు బైర్లు కమ్మాయని తెలిపారు. శనివారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరుపై మండిపడ్డారు. ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ జనప్రభంజనాన్ని కండ్లుండీ చూడలేని నేతలు కంటివెలుగులో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తెలంగాణ మాడల్ను దేశమంతా అమలు చేస్తామని, దేశవ్యాప్తంగా రైతుబంధును, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, దేశవ్యాప్తంగా మహిళలకు 35 శాతం రిజర్వేషన్, ఐదేండ్లలో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎజెండాతో బీజేపీలో వణుకు పుట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నదని మండిపడ్డారు.
రాష్ర్టానికి కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ దార్శనికతతో ప్రగతి పరుగులు పెడుతున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.1 లక్షా 24 వేలున్న తలసరి ఆదాయం రూ.2.75 లక్షలకు చేరిందని వివరించారు. గత సంవత్సరం బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉందన్నారు. దేశంలో ఈ స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రం మరోటి లేదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం ఆంక్షలు పెట్టి, అప్పు తెచ్చుకోని పరిస్థితులు కల్పించినా, రాష్ట్రంలో అన్ని రంగాలూ అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని చెప్పారు. తెలంగాణను దేశానికి రోల్మాడల్గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఐటీరంగాన్ని మంత్రి కేటీఆర్ ఉజ్వలంగా తీరిదిద్దుతున్నారని, కేటీఆర్ స్వశక్తి, ముందుచూపుతో వేల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి తెస్తున్నారని చెప్పారు.
అందుకు దావోస్ పర్యటనే నిదర్శమని తెలిపారు. కేటీఆర్ను అభినందించాల్సిందిపోయి బీజేపీ నేతలు అక్కసును వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా, వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. విభజన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎంపీలంతా పార్లమెంట్ లోపలా, బయటా పోరాటం చేస్తున్నా, రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కలిసిరాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు శాడిస్టుల్లా తయారయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి రేవంత్ను మించిన కోవర్టు మరొకరులేరని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలే అందుకు నిదర్శమని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ ఆశాకిరణంగా అవతరించిందని దేశ ప్రజలు భావిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఒడిశా పీసీసీ కార్యదర్శి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల నుంచి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరేందుకు సీఎం కేసీఆర్తో చర్చిస్తున్నారని చెప్పారు.