Gurukul Recruitment | హైదరాబాద్, డిసెంబర్27 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) కసరత్తు చేస్తున్నది. గత ఆగస్టులోనే రాతపరీక్షలు పూర్తికావడంతో మెరిట్ జాబితాను సిద్ధం చేసింది. ఎంపిక ప్రక్రియ చేపట్టే క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టుల భర్తీపై ట్రిబ్ దృష్టిసారించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే చేపట్టింది. ఇందులో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా 1ః2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ట్రిబ్ సిద్ధం చేసిం ది.
అభ్యర్థులను డెమోకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్న దశలో హారిజంటల్, వర్టికల్ రిజర్వేషన్ విధానం, గురుకుల ఉద్యోగుల ప్రమోషన్లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో కోర్టు ఆదేశాల కోసం ట్రిబ్ ఎదురుచూస్తున్నది. వారంలో ఆయా అంశాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని ట్రిబ్ భావిస్తున్నది. కోర్టు కేసులు పరిష్కారమైన వెంటనే ఎక్కడా జాప్యం లేకుండా నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, డెమో నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి గురువారం ఒకరోజు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.