నీలగిరి, డిసెంబర్ 4: నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురై ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు, పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకృష్ణా ట్రావెల్స్కు చెందిన బస్సు 38 మంది ప్రయాణికులు, డ్రైవర్, హెల్పర్తో కలిసి హైదరాబాద్ నుంచి చీరాలకు బయల్దేరింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయానికి నల్లగొండ జిల్లా కేంద్రం శివారులోకి చేరుకో గానే అగ్ని ప్రమాదానికి గురైంది. ఏసీ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై షార్ట్ సర్క్యూట్ కావడంతో మంట లు ఎగిసిపడ్డాయి.
ఈ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను నిద్రలేపారు. వారంతా అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. మంటలు ఎగిసిపడి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఒకరు మాత్రం బయటికి రాలేక సజీవ దహనమైనట్టు తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్, బంగారంతోపాటు అమెరికా వెళ్లాలనే ఓ అమ్మాయి వీసా పాస్పోర్టు కాలిపోయినట్టు నల్లగొండ రూరల్ ఎస్సై కంచర్ల భాస్కర్రెడ్డి తెలిపారు.