రఘునాథపాలెం, అక్టోబర్ 10: ఎన్నికలు వచ్చినప్పుడే కన్పించే పార్టీలు, రాజకీయ టూరిస్టులను అసలు నమ్మోద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రఘునాథపాలెం మండలంలో రూ.కోటి వ్యయంతో నిర్మించే తాసిల్దార్, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, మంత్రి కేటీఆర్ సహకారంతో ఏటా కోట్ల నిధులు తీసుకొచ్చి రాష్ర్టానికే ఖమ్మంను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు.
జిల్లాలో రఘునాథపాలెన్నీ జిల్లాకే రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. మూడున్నర ఏండ్లలోనే రూ.100 కోట్ల నిధులు తీసుకొచ్చి మండలాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించామని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశం మెచ్చిన నేత అని కొనియాడారు. రాష్ట్రంలో గుడుంబాను నిర్మూలించి ఆడబిడ్డల తాళిబొట్లను కాపాడిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రధాన భూమిక పోషించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగుభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, జడ్పీటీసీ మాలోతు ప్రియాంక పాల్గొన్నారు.