హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ సభ్యులైనా, బయటకు వెళ్లిన వారికైనా ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేవలు ఎలా అందుతున్నాయో వాహనదారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొంగులేటి అనుచరుల కేసుల వ్యవహారానికి సంబంధించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు అధికారులు మంత్రి దృష్టికి తేగా, సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.