హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మాడల్ స్కూళ్ల టీచర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మొదటి వారంలో బదిలీల ప్రక్రియ చేపట్టనున్నది. వీరి నియామకం తర్వాత బదిలీలు చేపట్టడం ఇదే మొదటిసారి. 2011లో మాడల్ స్కూళ్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, 2013 నుంచి 2014 వరకు నియామక ప్రక్రియ కొనసాగింది. ఇంతకాలంగా వీరంతా ఒకేస్థానంలో కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి వీరికి 2019లో సర్వీస్రూల్స్ అమలు చేసింది. తమను బదిలీ చేయాలంటూ ఉద్యోగులు కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు బదిలీలకు పచ్చజెండా ఊపింది.
రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, 2,833 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. బదిలీల్లో భాగంగా వీరిని జీవో 317 ద్వారా కొత్త జోన్లు, మల్టీజోన్లకు కేటాయించాల్సి ఉంది. అంతకుముందు ఈ పోస్టులు ఏ క్యాటగిరీకి చెందుతాయో తేల్చాలి. గతంలో ప్రిన్సిపాళ్లు స్టేట్ క్యాడర్ పోస్టులు కాగా టీజీటీలు, పీజీటీలు జోనల్ పోస్టులుగా ఉండేవి. పోస్టులను తేల్చి, కొత్త జోనల్ విధానం ప్రకారం కేటాయించి, ఆ తర్వాత బదిలీచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం అధికారులు మార్గదర్శకాలను రూపొందించి విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాకు పంపించారు. ప్రభుత్వ ఉత్తర్వులను బట్టి బదిలీలపై ముందుకెళ్లనున్నారు.
మాడల్ స్కూల్ టీచర్లకు తొమ్మిదేండ్లుగా బదిలీలు చేపట్టలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం సంతోషదాయకం. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా బదిలీలు చేపట్టాలి. నూతన విద్యాసంవత్సరంలోపే బదిలీలు చేపట్టి, ఆ తర్వాత పదోన్నతులు కల్పించాలి.
– భూతం యాకమల్లు, తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు అన్ని చర్య లు తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి చెప్పారు. మాడల్ స్కూల్స్, కేజీబీవీలు, ఇతర ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో ఆమె మాట్లాడుతూ.. కేజీబీవీల్లోని కాంట్రాక్ట్ టీచర్ల బదిలీల ప్రక్రియకు అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించామని చెప్పారు. మాడల్ స్కూల్స్ టీచర్ల బదిలీలపైనా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామని, వీరి బదిలీలకు అధికారులు మార్గదర్శకాలను రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఇతర ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి, న్యాయపరమైన అవరోధాలు తలెత్తుతున్నందున న్యాయశాఖ సలహాలు తీసుకొని కసరత్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి