హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమ్మతించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన ఉత్తరంపై తెలంగాణ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏపీకి చెందిన 1,369 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిని ఆంధ్రాకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేదని ధ్రువీకరణ ఇచ్చి పంపిందన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా వీరిని తీసుకొనేందుకు అంగీకారం తెలిపిందన్నారు. అలాగే, ఏపీలో పనిచేస్తున్న 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావాలని దరఖాస్తు చేసుకొన్నారని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం వారికి ఎన్ఓసీ ఇచ్చి, సంబంధిత లేఖను తెలంగాణకు పంపిందన్నారు. ఈ ఉద్యోగుల బదిలీలను మానవతాదృక్పథంతో పరిశీలించి, సత్వర నిర్ణయం తీసుకోవాలని నారాయణ కోరారు.