హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఈ దఫా 60 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నది. మరో 10 వేల మందికి పదోన్నతులు లభిస్తాయి. బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులంతా వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. పదోన్నతులు పొందిన వారు 15 రోజుల్లో విధుల్లో చేరాలి. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రకియ ఆదివారం నుంచి ప్రారంభంకానున్నది. ఆన్లైన్లోనే దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులను ఎడిట్ చేసుకొని తప్పులను సవరించుకోవచ్చు. ఈ ఏడాది జనవరి/ఫిబ్రవరి నెలల్లో విడుదల చేసిన బదిలీల షెడ్యూల్లో జాయినింగ్/రిపోర్టింగ్ తేదీని ఏప్రిల్ 23గా ప్రకటించారు. అయితే ఆ షెడ్యూల్ గడువు ముగియగా, తాజాగా మరో షెడ్యూల్ను ప్రకటించారు.
అయితే ఈ షెడ్యూల్లో జాయినింగ్/రిపోర్టింగ్ తేదీని ప్రకటించలేదు. ఇదే విషయంపై అధికారులను ఆరా తీయగా, అప్పట్లో విద్యా సంవత్సరం ముగిసేరోజున జాయిన్ కావాలని ఆదేశాలు ఇచ్చామని, తాజా బదిలీల్లో వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చారు. తాజా అంచనాల ప్రకారం 2018లో బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు, టీచర్లు తప్ప మిగతా వారికి స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. పదవీ విరమణకు మూడేండ్ల సర్వీసు ఉన్న వారికి మినహాయింపు ఇవ్వగా, వారికి బదిలీ అప్షన్కానున్నది. అంటే వారు బదిలీ కోరుకుంటే అవకాశం కల్పిస్తారు.
కొత్తగా మళ్లీ దరఖాస్తు
గతంలో బదిలీలకు అవకాశం కల్పించినప్పుడు 59 వేలకు పైగా ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించారు. తాజాగా బదిలీల దరఖాస్తులతో మరో 15 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నది. మొత్తంగా పాఠశాల విద్యాశాఖలో 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా, 60 వేల మందికి స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. అంటే 50 శాతానికి పైగా బదిలీకానున్నారు. మరో 9,979 మందికి పదోన్నతులు లభిస్తాయి. వీరిలో 1,947 మంది స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా, 2,162 మంది ఎస్జీటీలకు ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా, మరో 5,870 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే అవకాశాలు ఉన్నట్టుగా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.