హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ (ఎస్సార్పీసీ) సమావేశాలు శుక్ర, శనివారాల్లో బెంగళూరులో జరుగనున్నాయి. దక్షిణ ప్రాంత రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలోని జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు పాల్గొనే ఈ కీలకమైన సమావేశానికి తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు చైర్మన్గా వ్యవహరించనున్నారు. 2022-23 సంవత్సరానికి ప్రభాకర్రావును చైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఎస్సార్పీసీలో భాగంగా శుక్రవారం నాడు టెక్నికల్ కోఆర్డినేషన్ కమిటీ (టీసీసీ) 40 వ సమావేశం జరుగనుంది. దీనికి తెలంగాణ ట్రాన్స్కో డైరెక్టర్ టీ జగత్రెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఈ టెక్నికల్ కమిటీలో మరో 37 మంది సభ్యులున్నారు. వీరందరూ కలిసి కీలకమైన సాంకేతికాంశాలపై లోతుగా చర్చిస్తారు. దక్షిణ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా, గ్రిడ్ నిర్వహణ, సమన్వయంపై చర్చించి అంశాలవారీగా ఎస్సార్పీసీకి నివేదిస్తారు.
ఈ కమిటీలో తెలంగాణ ట్రాన్స్కో డైరెక్టర్ (గ్రిడ్) బీ నర్సింగరావు, జెన్కో థర్మల్ డైరెక్టర్ బీ లక్ష్మయ్య, ఎస్పీడీఎల్ డైరెక్టర్ టీ శ్రీనివాస్, ఎస్ఈ (టెక్నికల్) ఈగ హన్మాన్ తదితరులు పాల్గొంటారు. శనివారం జరిగే ఎస్సార్పీసీ సమావేశంలో టెక్నికల్ కోఆర్డినేషన్ కమిటీ విస్తృతంగా చర్చించిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం దక్షిణాది రాష్ర్టాల్లో విద్యుత్తు యాజమాన్యం, గ్రిడ్ నిర్వహణ తదితర అంశాలుంటాయి. అలాగే ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య మరింతగా విద్యుత్తు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. దీనితోపాటు కేంద్ర ప్రభుత్వం తాజాగా విదేశీ బొగ్గును 10 శాతం వాడాలంటూ తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాదిలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలపై పడే ప్రభావంపై చర్చించనున్నారు.