హైదరాబాద్: ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్ రావు (Prabhakar rao) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు.. తొమ్మిదిన్నరేండ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 22 ఏండ్ల వయస్సులోనే విద్యుత్ శాఖలో చేరిన ఆయన 2014, జూన్ 5న జెన్కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్ 25న ట్రాన్స్కో ఇన్చార్జిగా నియమితులయ్యారు. తొలుత ఆయన్ను రెండేండ్ల పదవీ కాలానికి సీఎండీగా ప్రభుత్వం నియమించినప్పటికీ.. తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నది. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 54 ఏండ్లపాటు సంస్థకు సేవలు అందించారు. తన పదవీ కాలంలో విద్యుత్ శాఖకే ఆయన వెలుగులు పంచి వన్నె తెచ్చారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు కమ్ముకుంటాయని జరిగిన ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి 2014లో సీఎం కేసీఆర్ 24 గంటల నిరంతరం కరెంటు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టారు. చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ వెలుగులను పంచడానికి ముందుకు సాగిన కేసీఆర్కు ఆయన ఒక కార్యకర్తగా కృషిచేశారు.