హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. నీటి వనరుల అభివృద్ధి, తెలంగాణ ఆర్థిక వనరులు, వ్యవసాయం, సంక్షేమం, వైద్యం, విద్య తదితర అంశాలపై ఆయా రంగాల నిష్ణాతులతో అవగాహన కల్పించింది.
ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ మహేశ్ బెనహర్ దత్ ఎకా ఆదేశాల మేరకు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ పింగిల్, కోర్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమం కొనసాగింది. శిక్షణ ముగింపు సందర్భంగా డాక్టర్ రావులపాటి మాధవి మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మహిళా భద్రత కొరకు తీసుకొచ్చిన చట్టాలను అమలు పరచాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిపై ఉంటుందని సూచించారు. అనంతరం శిక్షణకు హాజరైన అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ తరఫున డిప్యూటీ డైరెక్టర్లు ఎస్ పాండురంగారావు, ప్రసాదరావు, అసిస్టెంట్ డైరెక్టర్ డీవీజేఏవీ ప్రసాద్ హాజరయ్యారు.