హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖ సహకారంతో వచ్చే రెండు నెలల్లో ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి నేల ఆరోగ్యంపై స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. సోమవారం వర్సిటీ పాలకమండలి చివరి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ.. ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. పీజేటీఏయూ పరిధిలోని 31 రైతు విజ్ఞాన కేంద్రాలు,15 పరిశోధనా సంస్థల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు నిర్వహిస్తామని జానయ్య వెల్లడించారు. దాదాపు 200 బృందాలు సుమారు 1,600 గ్రామాల్లో పర్యటించనున్నట్టు ఆయన తెలిపారు.