హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అందరి బంధువు, సబ్బండ వర్గాలకు సాయంగా ఉంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రజలు, ప్రాంతాలకు అతీతంగా అందరి కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాలకుర్తికి చెందిన పలువురు గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులు, హైదరాబాద్లో మంత్రి దయాకర్రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి దయాకర్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగానే త్వరలోనే గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు, గిరిజన బంధువు పథకం అమలవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, మడమ తిప్పరన్నారు. సీఎంలాంటి వ్యక్తి మరొకరు దొరకని, ఆయనకు అండగా ఉండాలన్నారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల కోసం ఆరేళ్ల కిందనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం ఆ బిల్లుని కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. కొద్ది రోజుల కిందటే ఆ బిల్లే తమ వద్దకు రాలేదని బుకాయించారని, చివరకు వచ్చిందని చెప్పారని, ఈ పరిస్థితుల్లో కేంద్రం ఉంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేంద్రం కాదన్నా.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే దళితబంధు లాగే గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారని, ఆయనకు అందరు కృతజ్ఞతలు తెలుపుతూ అండగా ఉండాలని సూచించారు. దేశంలో ఇలాంటి సీఎంలు లేరని, ప్రజలందరి కోసం ఆలోచిస్తున్న ఆయనకు.. ధన్యవాదాలు తెలుపాలన్నారు. సందర్భం వచ్చిన సందర్భంలో అండగా నిలువాలని గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.