వనపర్తి : వనపర్తి జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటనపై జిల్లా మంత్రి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy ) విచారం వ్యక్తం చేశారు.
జిల్లాలోని శ్రీరంగాపురం మండలం తాతిపాములలో వీరసముద్రం చెరువు(Pond)లో బట్టలు ఉతకడానికి వెళ్లి గంధం కురుమన్న ముగ్గురు కుమార్తెలు గంధం తిరుపతమ్మ (16) గంధం సంధ్య (12) గంధం దీపిక (10)లు పడి మరణించారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటికి వారి మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
జరిగిన ఘటనను తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. వారి మరణం దురదృష్టకరమని, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా(Government) ఆదుకునేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.