Medak | మెదక్ : ఇది హృదయవిదారక ఘటన. తల్లి గుండెపోటుతో చనిపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేని కుమారుడికి.. ఆమె అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కౌడిపల్లి కి చెందిన దొంత లలిత(70) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. అదే రోజు సాయంత్రం లలిత అంత్యక్రియలు నిర్వహించారు. లలిత మృతితో ఆమె కుమారుడు నరేందర్(45) తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. నరేందర్కు కూడా సోమవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. తల్లీకుమారుడు 24 గంటల వ్యవధిలోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నరేందర్ భార్యా, పిల్లల రోదన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.