పెద్దపల్లి : వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల పొంగిపొర్లుతున్న వాగులు, వంకలను, జలపాతాలను తిలకించేందుకు సందర్శకులు భారీగా చేరుకుంటున్నారు. అయితే సమీప ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలాన ప్రమాదానికి గురై మృతి చెందుతున్నారు. అలాంటి ఘటనలోనే ఓ వైద్య విద్యార్థి (Medico Student) ప్రాణాలు కోల్పోయిన తాజా ఘటన పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బీతం గ్రామంలోని గౌరీ గుండాల జలపాతం (Waterfalls) వద్ద బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కిసాన్నగర్కు చెందిన మానుపాటి వెంకటేష్ ప్రసాద్ (23) స్నేహితులతో కలిసి గౌరిగుండాల వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చారు.
జలపాతం వద్ద రాళ్లపై ప్రమాదవశాత్తు జారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, రెస్క్యూ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.