కాజీపేట, నవంబర్ 13: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో తీవ్ర విషాదం నిం పింది. కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్ కథనం ప్ర కారం.. దర్గా కాజీపేట, భీంనగర్లో కన్నెబోయిన రవి ప్రసాద్-రేణుక (36) దంపతులు. వీరు కూతురు నవ్య(14), తల్లి ఇజ్జమ్మ(75) కలిసి నివసిస్తున్నారు. రవిప్రసాద్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇటు తల్లి ఇజ్జమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో రేణుక అత్తకు సపర్యలు చేస్తున్నది. రేణుక కూడా ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది.
వైద్యానికి డబ్బుల్లేక అవస్థలు పడుతున్నది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన రేణుక చనిపోవాలని నిర్ణయించుకుంది. తాను మరణిస్తే బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని భావించి, కూతురిని తీసుకొని ఈనెల 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆదివారం స్థానిక బంధం చెరువులో రేణుక, నవ్య మృతదేహాలను గుర్తించారు. విషయం తెలిసిన అత్త ఇజ్జమ్మ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెండటంతో దర్గా కాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.