ములుగు : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటాలు అలుగు పోస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కాగా, గోదావరి నది వరదల కారణంగా హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా మీదుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం భూపాలపట్నం కు వెళ్లే 163 జాతీయ రహదారి పై టేకులగూడెం గ్రామశివారులో రహదారి పైకి గోదావరి వరద చేరడంతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గేంత వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.