హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ (Secunderabad) పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్లో ప్రధాని పాల్గొంటారు. దీంతో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు రోడ్లను పూర్తిగా మూసివేయనున్నారు. మరికొన్ని చోట్ల వాహనాలను దారిమళ్లించనున్నారు.
మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం) జంక్షన్, గ్రీన్ లాండ్స్, ప్రకాశ్నగర్, రసూల్పురా సీటీఓ, ఫ్లాజా, ఎస్బీహెచ్, వైఎంసీఏ, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్డు, ఆలుగడ్డబావి, చిలకలగూడ జంక్షన్, ఎంజే రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్పీ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆ రూట్లు, జంక్షన్ల వైపు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే స్టేషన్కు చేరుకోవాలని పోలీసులు తెలిపారు. ఉప్పల్-సికింద్రాబాద్ రూట్లో సైతం ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
కాగా, ప్రధాని మోదీ పర్యటన ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దీంతో పదో తరగతి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఒక గంట ముందే తమ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఎగ్జామ్కు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తం కావాలన్నారు. అదేవిధంగా ఎస్సై, ఏఎస్సై పరీక్షలు ఉన్నందువల్ల అభ్యర్థులు వీలైనంత తొందరగా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు.