హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): వాహనదారులు చెల్లించిన ట్రాఫిక్ చలాన్ల డబ్బును ట్రాఫిక్ పోలీసులు కొట్టేసినట్టు నమస్తే తెలంగాణలో మంగళవారం ప్రచురితమైన ‘స్కాన్ స్కామ్’ కథనం సంచలనం సృష్టించింది. కమిషనరేట్ పోలీసుల్లో ఈ కథనం చర్చనీయాంశం కాగా చాలామంది వాహనదారులు తమ చలాన్ల డబ్బు చెల్లింపు జరిగిందా? లేదా? అంటూ చెక్ చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక హోంగార్డుపై ఇప్పటికే వేటు వేసినప్పటికీ అసలు సంగతి బయటకు పొక్కనీయకుండా సంబంధిత జోన్ పోలీసులు గప్చుప్గా ఉన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారులు అప్రమత్తమై ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి స్కామ్లు జరిగాయోనంటూ ఆరా తీస్తున్నారు. హోంగార్డును విచారించి అసలు దీనివెననుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలంటూ స్థానిక పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ స్కామ్లో మరో విధంగా కూడా ట్రాఫిక్ సిబ్బంది చలాన్ల డబ్బును దారి మళ్లించినట్టు తాజాగా తెలిసింది.
స్కామ్లో కొత్త కోణం
హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ వాహనదారులపై పెండింగ్లో ఉన్న చలాన్ల వివరాలు తెలుస్తాయి. వాటిని వసూలు చేసే క్రమంలో హోంగార్డు తన తెలివిని ఉపయోగించి తన స్టేషన్కు సంబంధించిన కొందరు అధికారుల సహకారం తీసుకున్నట్టు తెలిసింది. మొదట్లో ఫేక్ స్కానర్లు పెట్టినప్పటికీ అది బయటపడటంతో డబ్బు కొట్టేసేందుకు మరో కొత్త పద్ధతిని అమలులో పెట్టినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఉదాహరణకు ఎక్స్ అనే వాహనదారుడిపై రూ.10 వేల చలాన్లు పెండింగ్ ఉన్నట్టు గుర్తిస్తే.. వెంటనే అతనికి ఈ హోంగార్డు ఫోన్చేస్తాడు. అందులో సగం చెల్లిస్తే చాలు మొత్తం చలాన్లు తీసేస్తానని చెప్పడంతో ఆ వాహనదారుడు రూ.5 వేలు నగదు రూపంలో తెచ్చి ఇస్తాడు. ఇక్కడ యూపీఐ లేదా ఆన్లైన్ చెల్లింపులను ఉపయోగించరు.
ఆ తర్వాత హోంగార్డు తన అసలు స్కామ్కు తెరదీస్తాడు. ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేసే క్రమంలో తాము ఆపిన వై అనే వాహనదారుడిపై ఎంత పెండింగ్ ఉంది, ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏమిటనే దిశగా ఆరా తీసి ఈ హోంగార్డు అతడిని ఆ డబ్బులు కట్టమని అడుగుతాడు. చలాన్లలో కొంతవరకైనా చెల్లించాలని చెప్తాడు. దీంతో వాహనదారుడు ఎంతో కొంత చెల్లించడానికి సిద్ధపడుతాడు. ఆ సమయంలో తాను కడుతున్నది తన వాహనానికేనా అని చెక్ చేసుకోకుండా తన ఫోన్నంబర్ చెప్పడంతో హోంగార్డు ట్యాబ్లో తాను గతంలో వసూలు చేసిన ఎక్స్ అనే వాహనదారుడి వాహన చలాన్ డబ్బును, అతని వాహనం నంబర్ను ఎంటర్చేసి.. ఫోన్నెంబర్ మాత్రం వై అనే వాహనదారుడిది ఎంటర్ చేస్తాడు. దీంతో వైకి ఓటీపీ రాగానే అతను ఆ ఓటీపీ చెప్పడంతో డబ్బులు ఎక్స్ అనే వాహనదారుడి చలాన్ చెల్లించినట్టు క్రెడిట్ అయిపోతాయి.
ఇక్కడ కూడా హోంగార్డు తెలివిగా స్కానర్లు పనిచేయడం లేదని, సర్వర్ డౌన్ ఉందని ఇలా పలురకాల కారణాలు చెప్పి, వాహనదారుడి వద్ద ఎంత ఉంటే అంత నగదు రూపంలో ఇచ్చి వెళ్లాలని సూచిస్తాడు. తాను చలాన్ కట్టాననుకుని వెళ్లిపోయిన వై అనే వ్యక్తి తర్వాత కొన్నిరోజులకు తన పెండింగ్ చలాన్లను చెక్ చేసుకుంటే పాత చలాన్ తిరిగి వస్తుండడంతో దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చెప్పినా ఫలితం ఉండదు. అతను చెల్లించినట్టు ఎక్కడా తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేస్తారు. ఇక్కడ డబ్బులు కోల్పోయేది వై అనే వాహనదారుడు కాగా సర్కార్కు ఎలాంటి నష్టం జరగదు. ఇలా సుమారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కేవలం ఎనిమిదినెలల్లో కొట్టేసినట్టు ఆ వర్గాలు వివరించాయి. డ్రంకెన్ డ్రైవ్ కూడా చాలామంది పోలీసులకు ఆదాయమార్గంగా మారినట్టు తెలుస్తున్నది. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసే క్రమంలో కొందరు ఉన్నతవర్గాలకు చెందినవారు తమ పేర్లు బయటపెట్టవద్దంటూ క్షేత్రస్థాయిలోనే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని, వాహనదారులు పేర్కొంటున్నారు.
కమీషన్లకు వేదికలుగా వ్యవస్థలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వ్యవస్థను కమీషన్లకు వేదికగా మార్చడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా.. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘2 కోట్ల స్కాన్ స్కామ్’ వార్తను పోస్టు చేశారు. దీనిపై ఆయన స్పంది స్తూ.. కాంగ్రెస్ స్కీమ్ల ప్రభు త్వం కాదని, స్కామ్ల ప్రభుత్వం అని చురకలు అంటించారు. ప్రజలకు మేలు చేసే పథకాలతో మొదలు.. ప్రతి దాంట్లో కమీషన్లు, కుంభకోణాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.