Medaram Jathara | ములుగు, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జాతర సందర్భంగా తాడ్వా యి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ అధికారులపై భక్తులు దాడికి ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి సుమారు 4 నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ స్తంభించిపో యింది. సీఎం పర్యటన ముగిసిన తర్వాత పోలీసులు జాతర పూర్తయినట్టు భావించి కుటుంబ సభ్యులు, స్నేహితులకు దర్శనం చేపిస్తూ కనిపించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. భక్తులను గమ్యస్థానం చేర్చడంలో పోలీసులు విఫలమయ్యారు.
శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్కు దర్శనం చేయించడంలో జిల్లా యం త్రాంగం విఫలమైంది. స్పీకర్ గద్దెల మధ్య నుంచే వెనుదిరిగి సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజును మాత్రమే దర్శించుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరుతో మేడారం సమ్మక్క, సారలమ్మకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించారు. టీఫోలియో యాప్ ద్వారా ఆన్లైన్లో అమ్మవారికి మొక్కు చెల్లించారు.
తెలంగాణ కుంభమేళా శనివారం ముగిసింది. సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేశారు. ఆదివాసీ వడ్డెలు ప్రత్యేక పూజల తర్వాత వనం చేర్చారు. మొదట గోవిందరాజును అర్రెం వంశీయుల పూజారుల బృందం తరలించింది. పగిడిద్దరాజును పెనక బుచ్చిరాములు పూజారుల బృందం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయం త్రం వీరు గమ్యాన్ని చేరుకోనున్నారు. ప్రధాన వడ్డె కాక సారయ్య సహా ఇతర వడ్డెలు సారలమ్మను గద్దె పైనుంచి కన్నెపల్లికి తీసుకెళ్లారు. సమ్మకను గద్దె నుంచి కొకెర కృష్ణయ్య పూజారుల బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించి, వన ప్రవేశానికి తీసుకెళ్లింది.