యాదాద్రి భువనగిరి : హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. తోళ్లు తరలిస్తున్న ఓ లారీ నిన్న సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో బోల్తా పడింది. కుండపోత వర్షాల కారణంగా లారీని తొలగించే ప్రక్రియకు అంతరాయం కలిగింది. దీంతో ఆ లారీ నిన్న సాయంత్రం నుంచి జాతీయ రహదారిపైనే ఉంది. రహదారిపై నుంచి లారీని పక్కకు తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తోళ్లను మరో లారీలోకి పోలీసులు లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విజయవాడ – హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.