హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: గుండెపోటుతో అచేతనస్థితిలో పడిపోయిన ప్రయాణికుడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఆరాంఘర్ చౌరస్తాలో గురువారం చోటుచేసుకున్నది. ఎల్బీనగర్లో నివసించే 40 ఏండ్ల బాలాజీనాయక్ వనపర్తి జిల్లాలోని కొత్తకోట చెక్పోస్ట్లో పనిచేస్తారు. గురువారం విధులకు హాజరయ్యేందుకు ఎల్బీనగర్లో ఆర్టీసీ బస్సు ఎక్కి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆరాంఘర్ చౌరస్తాలో దిగి వెంటనే పడిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ గమనించి అక్కడికి వెళ్లారు. తాను శిక్షణలో నేర్చుకున్న సీపీఆర్ చేశారు.
బాలాజీ ఛాతిపై పలుమార్లు చేతులతో ఒత్తిడి (సీపీఆర్) చేయగా ఆయన శ్వాస తీసుకోవడం ఆరంభించారు. స్థానికులు అప్పటికే 108కు సమాచారం అందించడంతో అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నది. ఆయనను అంబులెన్స్లో హైదర్గూడలోని జర్మన్టైన్ దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబసభ్యులు ఆయనను మరో దవాఖానకు తీసుకెళ్లారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడారని రాజశేఖర్కు కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్ శ్యాసుందర్రెడ్డి రాజశేఖర్ను అభినందించారు. అచేతనస్థితిలో పడిపోయిన తనకు రాజశేఖర్ సీపీఆర్ చేసి కాపాడి పునఃర్జన్మ ప్రసాదించారని బాలాజీ తెలిపారు. ఆరోగ్యంతో కోలుకున్న ఆయన రాజశేఖర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అభినందించిన మంత్రి హరీశ్రావు
విధులను నిర్వహించడతోపాటు గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సకాలంలో సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ ద్వారా అభినందించారు. ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆకస్మిక గుండెపోటు కేసుల నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఫ్రంట్లైన్ ఎంప్లాయీస్, వర్కర్స్కు సీపీఆర్పై శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.