కవాడిగూడ, డిసెంబర్ 25: బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న వైశ్యులు మద్దతు ఇవ్వాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అధ్యక్షుడు, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్ ఆడిటోరియంలో ఐవీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఐవీఎఫ్ బెనారస్ ఆనంద నిలయం ట్రస్ట్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తాతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఐవీఎఫ్ విద్యార్థులకు, కులస్థులకు అన్నిరకాల సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని తెలిపారు.
ఆర్యవైశ్యులకు ఏ సీఎం ఇవ్వనన్ని పదవులను సీఎం కేసీఆర్ ఇచ్చారని కొనియాడారు. జిల్లాల్లో వైశ్య భవనాలకు స్థలాలు, నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అగర్వాల్, జైన్, గుప్తా, ఖండల్వాలా, శెట్టీలను ఏకం చేసి బీఆర్ఎస్కు మద్దతు కూడగడతానని తెలిపారు. అనంతరం ఐవీఎఫ్ బెనారస్ ఆనంద నిలయం ట్రస్ట్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ.. కాశీలో నిర్మించనున్న ఐవీఎఫ్ బెనారస్ ఆనంద నిలయానికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ బెనారస్ ఆనంద నిలయం వైస్ చైర్మన్ మద్దుల రామ్జీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశ్వేశ్వర్రావు, కోశాధికారి ఉడుత పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.