వైరాటౌన్, మార్చి 9 : మద్యం అమ్మకాలపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా ఐఎంఎల్ డిపో ఎదుట మద్యం షాపుల నిర్వాహకులు శనివారం నిరసనకు దిగారు. వ్యాపారులు మద్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో డిపో వెలవెలబోయింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వైన్స్ అండ్ బార్ అసోసియేషన్ కన్వీనర్ గుర్రాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మద్యం వ్యాపారులు అమ్మకాలపై జీఎస్టీ, ఇతర పన్నులు కట్టలేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, దీనికి అదనంగా వ్యాట్ పేరుతో మరో ఏడు శాతం పెంచడంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
పాత విధానాన్ని అమలు చేయడంతోపాటు వ్యాట్ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు మద్యం కొనుగోళ్లను నిలిపివేస్తామని హెచ్చరించారు. అనంతరం ఐఎంఎల్ డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. నిరసనలో వైన్స్ అండ్ బార్ అసోసియేషన్ జిల్లా నాయకులు గొర్రెపాటి నరేశ్, సుబ్బారావు, వైన్ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు.