హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): స్వలాభం కోసం వినియోగదారులకు అన్యాయం చేసే ఆలోచనలు చేయొద్దని వ్యాపారులకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హితవు పలికారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించటమే గొప్ప మానవ సేవ అని సూచించారు. వరల్డ్ మెట్రాలజీ డే సందర్భంగా శుక్రవారం రెడ్హిల్స్లోని ఎఫ్టీసీసీఐలో జరిగిన కార్యక్రమానికి వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వినియోగదారుల మన్ననలు పొందేలా వ్యాపార లావాదేవీలు ఉండాలని, వినియోగదారుడి సంతృప్తే వ్యాపారానికి అవసరమన్నది విస్మరించవద్దని స్పష్టం చేశారు. తూనికలు, కొలతల పట్ల వినియోగదారులకు అనుమానాలు ఉంటాయని, వాటికి తావివ్వకుండా వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
ఏ వ్యాపారానికైనా ఆయువుపట్టు వినియోగదారుడేనని, వారి ఆదరాభిమానాలను చూరగొన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వ్యాపారులు మెరుగుపడాలని సూచించారు. వ్యాపార లావాదేవీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ అమీర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్, డీలర్స్ అండ్ రిపేర్స్ (తాందార్) సంఘం అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ, కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి అజిత్ గుప్తా, ఉపాధ్యక్షుడు గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.