పాలకుర్తి రూరల్, ఫిబ్రవరి 8: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గుట్ట వద్ద ఆదిమానవుల ఆనవాళ్లను గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు. ఆలయ పరిసరాలతో పాటు గుట్టపైన గుర్తించిన ఆనవాళ్లను బుధవారం వివరించారు. ఈ సందర్భంగా రత్నాకర్రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 5 వేల ఏళ్ల క్రితం ఆదిమానవులు జీవించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఆలయం ఎదురుగా రాతి బండపైన కొత్త రాతియుగానికి చెందిన రాతి పనిముట్లు తయారు చేసే ఆనాటి పరిశ్రమ ఉన్నట్టు గుర్తించానని చెప్పారు.
అక్కడ 17 లోతైన, పొడవైన విభాగాలు ఉన్నాయని చెప్పారు. ఇవి తెలంగాణలో చిర్రగోనె ఆట ఆడేటప్పుడు తవ్వుకునే బద్దుల వలే ఉన్నాయని వివరించారు. ఈ ఆనవాళ్లను బట్టి ఇక్కడ చరిత్ర పూర్వయుగం నాటి నుంచే మానవులు వ్యవసాయం చేసుకున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ చారిత్రక ఆనవాళ్లను టూరిజం, దేవాదాయ శాఖ పరిరక్షించాలని కోరారు. సోమన స్మారక మందిరం వద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తే చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రంగా పాలకుర్తి విలసిల్లుతుందని చెప్పారు.