హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీడీపీ పరిస్థితే కాంగ్రెస్కు కూడా రాబోతున్నదా..? గాంధీభవన్ను కిరాయికి ఇవ్వాల్సిన దుస్థితికి పార్టీ దిగజారుతున్నదా..? ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర నామమాత్రమేనా..? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. వరుస ఎన్నికల్లో ఓటములతో ఓల్డ్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికేదైనా సరే ముందే ఓటమి ఖాయమైపోతున్నది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. దశాబ్దాలపాటు రాష్ట్రంలో,కేంద్రంలో రాజ్యమేలిన ఆ పార్టీ ఇప్పుడు పరాజయ భారం మోస్తుండటంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నట్టుగా హస్తం పార్టీ దీనస్థితికి అనేక కారణాలున్నాయి. ఓ వైపు నాయకత్వ లేమి, మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోవడం కష్టమనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు రాష్ట్రంలో పటిష్ఠమైన ఓటు బ్యాంకు, క్యాడర్ కలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉన్నది. క్యాడర్ దూరమైంది. ఓటు బ్యాంకు కరిగిపోతున్నది. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. పార్టీలోనే ఉంటున్న క్యాడర్లోనూ భరోసా నింపే వారు కరువయ్యారు. గతంలో ఎంతో నమ్మకంగా హస్తంకు ఓటు వేసే వాళ్లు కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వేసేందుకు వెనుకంజ వేస్తుండటం గమనార్హం. ఇలా రాష్ట్రంలో ఇటు క్యాడర్కు, అటు జనాలకు పార్టీ దూరమైంది.
నాయకత్వలేమి, అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు జాతీయ స్థా యిలోనూ ఇటు రాష్ర్టాల్లోనూ ఆ పార్టీని ముం దుండి నడిపించే నాయకుడు కరువయ్యాడనే అభిప్రాయాలున్నాయి. జాతీయ స్థాయిలో ఆ పార్టీ సీనియర్ నేతలంతా నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. గులాంనబీ ఆజా ద్ కాంగ్రెస్ను వీడి ఇటీవలే కొత్త పార్టీ స్థాపించారు. ఇక రాష్ట్రంలోనూ అంతకన్న ఎక్కువ గందరగోళ పరిస్థితే ఉన్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నాయకత్వాన్ని ఇక్కడి సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఒంటెత్తు పోకడలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఎప్పు డూ లేని విధం గా రేవంత్రెడ్డి నాయకత్వంలో పార్టీ దారుణమైన ఫలితాలను పొందడంపై పార్టీ లో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో పార్టీని ఆయన కావాలని ఓడించారనే ప్రచారం జరుగుతున్నది.
2014 ఎన్నికల నుంచి మొదలైన ఆ పార్టీ ఓటముల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 2018 డిసెంబర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిన్నది. ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 28.4 శాతం మాత్రమే. ఇటీవల జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కనీస ఓట్లు సాధించలేక డిపాజిట్లనూ కోల్పోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో 13.48 శాతం, హుజూరాబాద్లో మరీ దారుణంగా 1.46 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. తాజాగా మునుగోడు ఎన్నికలోనూ 10.58 శాతం ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ దిగ్గజ నేత కుందూరు జానారెడ్డి సైతం ఓటమిపాలయ్యారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలోనూ ఉత్తమ్ కుమార్రెడ్డి భార్య పద్మావతి పరాజయం పొందారు. ఇలా వందేండ్ల చరిత్ర గల పార్టీ ఇప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని దీనస్థితికి దిగజారడం గమనార్హం.