హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి.. త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీచేసేందుకు అభ్యర్థులే దొరకని దుస్థితి నెలకొన్నది. హుజూరాబాద్లో పోటీకి అభ్యర్థిని ఎన్నుకోవడానికి మూడు సార్లు సమావేశమై.. రెండు కమిటీలు వేసినా అభ్యర్థి ఎవరన్నది ఖరారు కాలేకపోయింది. దీంతో చేసేదేమీ లేక.. హుజూరాబాద్లో పోటీచేయడానికి ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించింది. దరఖాస్తు చేసుకొన్నవారికి సోమవారం నుంచి ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారి రాజకీయ అనుభవం, ఆర్థిక, సామాజిక బలాన్ని అంచనావేసి తుది జాబితాను పీసీసీకి అప్పగించే బాధ్యతను సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్కలకు అప్పగించింది.
18లో ఏడుగురు స్థానికేతరులే ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ వార్డు మెంబర్ స్థాయిలోనైనా గెలువగల సత్తా ఉన్నవారు లేకపోవడం పీసీసీకి పాలుపోని పరిస్థితి కల్పించింది. అంతకుముందు హుజూరాబాద్ ఉప ఎన్నికకోసం దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ పేర్లను సిఫారసుచేసింది. కానీ, ఈ పేర్లపై టీపీసీసీ వర్కింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తంచేసి.. దరఖాస్తులను ఆహ్వానించింది. విచిత్రమేమంటే.. కమిటీ సిఫారసు చేసిన మూడు పేర్లలో కవ్వంపల్లి, కొండా సురేఖ దరఖాస్తు చేసుకోలేదు. ఒక్క పత్తి కృష్ణారెడ్డి మాత్రమే దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.
ఇంతోటి దరఖాస్తులకు రూ.5 వేలు వసూలు
అభ్యర్థులే కరువైన పరిస్థితుల్లో దరఖాస్తుకు ఐదువేల రూపాయల చొప్పున పీసీసీ వసూలుచేసింది. పోటీదారులు పెద్ద ఎత్తున ఉంటారనుకొన్నారేమో.. చివరకు 18 మంది మాత్రమే అప్లికేషన్ పెట్టుకొన్నారు. పోటీచేయడానికే ఎవరూ ముందుకు రావడంలేదంటే.. ఐదువేల రూపాయలు వసూలు చేయడమేమిటని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కమ్ ఠాకూర్ సమక్షంలో జరిగిన సమావేశంలోనే కొందరు సీనియర్లు ప్రశ్నించినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. హుజూరాబాద్లో కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందంటూ సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే వ్యాఖ్యానించినట్లు బయటకు పొక్కడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు హుజూరాబాద్లో పోటీకి ఆసక్తి ఉన్నవారు సొంతంగా ఎన్నికల ఖర్చు భరించాల్సి ఉంటుందని కూడా అంతర్గత చర్చలో ప్రస్తావనకు వచ్చిన అంశం కూడా బయటకు రావడంతో పోటీచేయడానికి కనుచూపుమేరలో ఎవరూ కనిపించడం లేదని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పులిమీద పుట్రలా హుజూరాబాద్ ఎన్నిక పండుగల తరువాత జరిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికా ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటున్న టీపీసీసీ అధినేత రేవంత్రెడ్డి మేకపోతు గాంభీర్యానికి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకొంటున్నారు.