Telangana | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇది తెలంగాణ చరిత్రలో చీకటిరోజు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న, ఎగతాళి చేస్తున్న విపక్షనేతల్లో ఇప్పుడు మరో నేత చేరారు. ఆయనే వీర సమైక్యవాది, చంద్రబాబు చేలా, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో టీయూడబ్ల్యూజే నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడిన రేవంత్రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర పుట్టుకను తప్పుబట్టారు. ‘లెక్కల జోలికెళ్తే.. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఏపీదే అధిపత్యం. 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ లో ఉన్నాయి. ఇవ్వొద్దని ఆంధ్రా, ఇవ్వాలని తెలంగాణ ప్రాంతం వారు కొట్లాడినప్పుడు పార్టీగా, యూపీఏ చైర్పర్సన్గా సాంకేతికంగా లెక్కలేసుకుం టే రాష్ట్రం ఇవ్వడానికి ఏ కోశానా అవకాశం లేదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నా ఏ మాత్రం ప్రయోజనం లేదు.
నష్టం చేకూర్చే నిర్ణయ మే’ అంటూ రేవంత్రెడ్డి వంకరటింకర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణ రాష్ట్ర పుట్టుకను ఇప్పటికే పలుమార్లు దారుణంగా అవమానించగా, తాజా ఇదే వరుసలో రేవంత్రెడ్డి చేరారు. ఏపీ విభజన సరిగ్గా జరగలేదని, అసహజంగా పార్లమెంట్ తలుపులు మూసి రాష్ర్టాలు విభజించారని, తల్లిని చంపి బిడ్డను తీశారంటూ మోదీ రాష్ట్ర పుట్టుకను అవమానించగా, విభజన సరిగ్గా జరగలేదంటూ అమిత్షా సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా రేవంత్రెడ్డి సాంకేతికంగా రాష్ర్టాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడారు. వాస్తవానికి అర్టికల్-3 ప్రకారం కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు. మెజార్టీ సీట్లు ఉన్న ప్రాంతం నుంచి మైనార్టీ సీట్లు ఉన్న ప్రాంతం వేరుపడతామంటే.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం వారు అడ్డుకుంటారనే ముందుచూపుతోనే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ నిబంధనను చేర్చారు. ఈ కారణంగానే ఉమ్మడి ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసినా లెక్కలోకి లేకుండా పోయింది. సాక్షాత్తు రాజ్యాంగ నిబంధనలే తెలంగాణకు రక్షణ కవచంగా నిలిచినా.. మెజార్టీ ప్రాంతమైన ఏపీలో 175 స్థానాలు ఉన్నాయని, సీమాంధ్రప్రాంతానిదే అధిపత్యమని చెప్పి రేవంత్రెడ్డి అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని రేవంత్ ‘మీట్ ది ప్రెస్’లో కలరింగ్ ఇచ్చారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా ధర్మంవైపు నిలబడ్డారని సోనియాగాంధీని పొగిడారు. అయితే, 2014లో తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ కరీంనగర్ సభలో హామీ ఇచ్చి బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్నారు. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చారు. తెలంగాణను ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో స్పష్టంచేశారు. కానీ మాటతప్పారు. ఐదేండ్లు తెలంగాణ ఏర్పాటు హామీని అటకెక్కించారు. చట్టబద్ధమైన ప్రక్రియను ప్రారంభించలేదు. ఆ తర్వాత ఐదేండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కేసీఆర్ నిరాహారదీక్ష చేస్తే డిసెంబర్ 9న ప్రకటన చేశారు. అనాడు ఉద్యమం తీవ్రతతో సాక్షాత్తు సీఎం రోశయ్య శాంతిభద్రతలు అదుపుతప్పాయని, తన వాళ్ల కాదంటూ చేతులు ఎత్తేశారు. ఈ పరిస్థితుల్లోనే ఉద్యమానికి తలొగ్గి, అనివార్య పరిస్థితుల్లో తప్పనిసరై మాత్రమే తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారు. కానీ ఆంధ్రా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే వారి బెదిరింపులకు లొంగి డిసెంబర్ 23న తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. దీంతో విద్యార్థి యువత అంతా నిరాశ నిస్పృహలకు లోనై బలిదానాలు చేసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రజలు, ఉద్యమనేత కేసీఆర్ పోరాడి మళ్లీ తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితిని కల్పించారు. ఉద్యమం తారాస్థాయికి చేరి ఒత్తిడి తీవ్రమడంతోనే తెలంగాణ ఇచ్చారు. తప్ప తెలంగాణపై ప్రేమతోకాదని పలుమార్లు స్పష్టమైంది. సోనియాగాంధీని బలిదేవత అన్ననోటితోనే రేవంత్ ఇప్పుడు క్రెడిట్ అంతా సోనియాదే అన్నట్టుగా వ్యాఖ్యానించడం విడ్డూరం. ఒక చోట నష్టపోతామని తెలిసి కూడా సోనియా త్యాగం చేశారని రేవంత్ చిలుకపలుకులు పలుకడం మరీ దారుణం. మరీ ధర్మంగా డిసెంబర్ 9 ప్రకటనపై సోనియా ఎందుకు నిలబడలేదో రేవంత్ సెలవిస్తే సరి.
ఇలా మాట్లాడటం రేవంత్కు ఇదేం కొత్తకాదు. ఇప్పటికే పలు మార్లు నోరు జారారు. అత్యంత హేళనగా, అవమానకరంగా మాట్లాడిన సందర్భాలనేకం. వ్యవసాయం దండుగ అని చంద్రబాబు వ్యా ఖ్యానిస్తే.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు చాలని రేవంత్ వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న రైతులను బిచ్చగాళ్లు అంటూ అవమానించారు. తెలంగాణలో ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను బీరు, బిర్యానీలు తిని, తిన్నది అరిగే దాకా మాట్లాడే అడ్డామీది కూలీ లాంటోళ్లు అంటూ విద్యార్థి నేతలపై నోరుపారేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, తాను మాత్రం రాజీనామా చేయకుండా పారిపోయిన రేవంత్ సమైక్యవాదానికే పరోక్షంగా మద్దతుగా నిలిచారు. ఎప్పటికప్పుడు అడ్డగోలుగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసందర్భోచితంగా మాట్లాడే రేవంత్ తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు.
రేవంత్రెడ్డి సెటిలర్ల ఓట్లను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు అంచనాలేస్తున్నారు. రేవంత్రెడ్డి ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొనడానికి కంటే ముందే ఉదయం 11 గంటలకు పచ్చి సమైక్యవాది, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్తో భేటీ అయ్యారు. చంద్రబాబు సూచనతోనే తాను రేవంత్రెడ్డితో భేటీ అయినట్టు శ్రీనివాస్ పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో ప్రెస్మీట్లో పాల్గొన్న రేవంత్.. ‘సాంకేతికంగా తెలంగాణను ఇవ్వాల్సిన అవసరం లేకుండే’ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చొరవతోనే కొలికపూడి శ్రీనివాస్ను రేవంత్ కలిశారని, తెలంగాణలోని సెటిలర్ల ఓట్ల కోసం తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తూ రేవంత్రెడ్డి అవమానకరంగా మాట్లాడినట్టు స్పష్టమవుతున్నది. ఇక తన కోణంలో అధిపత్యమని తనలోని సమైక్య కోణాన్ని ఆవిష్కరించారు. తానింకా చంద్రబాబు చేలానేనని నిరూపించుకుంటున్నారు. రేవంత్ కాంగ్రెస్లో ఉన్నా తన ఆత్మంతా సమైక్యవాదం చుట్టే తిరుగుతుందని, చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.