తెలంగాణలో అణువణువునా గొప్ప పర్యాటక శోభ దాగి ఉంది. కానీ, ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గాయి. సుందరీకరణకు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. కనీస వసతులు లేక కుప్పకూలినవీ, మట్టిలో కలిసిపోయినవీ అనేకం.సరైన రోడ్లు, రవాణా సౌకర్యం లేక నిర్జీవంగా కనిపించేవి. సకల పర్యాటక సంపదలున్నా ఇదీమా ఘనత, ఇవీ మా కట్టడాలు అని చెప్పుకోలేని పరిస్థితి. ఇదీ పదేండ్ల ముందటి దుస్థితి.
Telangana Tourism | చిమ్మచీకట్ల వెంట వెలుగులు నింపుతూ సాగిన కేసీఆర్ పాలనలోప్రతి ప్రాంతం సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ఉద్యమ సారథి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేశాక.. రాష్ట్ర పర్యాటకానికి నూతనోత్తేజం అందించారు. రాష్ట్రం నలుమూలలా సహజ జల వనరులు, తటాకాలు, కొండలు, కోనలు, కోటలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందాయి. పర్యాటకంపై ముఖ్యమంత్రికి ఉన్న పరిపూర్ణ అవగాహన వల్లే ప్రతి పల్లె ఓ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ప్రతీ వాగు, వంక ఆతిథ్య కేంద్రంగా పరిఢవిల్లుతున్నాయి. చెరువులు నిండు కుండల్లా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితవనం ఫలితంగా గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకుని.. అతిథులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్తో పోటీగా ప్రతి జిల్లాలోనూ పర్యాటకాన్ని ఉరుకులు పెట్టిస్తున్నది తెలంగాణ సర్కార్. తెలంగాణ యాత్రా స్థలాలు.. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల మనసులనూ దోచుకుంటున్నాయి. పర్యాటకం అంటే విజ్ఞాన వినోదాలే కాదు ఎంతోమందికి బతుకు మార్గమని తెలంగాణ నిరూపిస్తున్నది.
ఒకప్పుడు ఆకలి చావులు, వలసలు, కరువులకు పర్యాయపదంగా నిలిచిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.. నేడు పర్యాటకంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. రెండు వేలకు పైగా ఎకరాలతో కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, వందలాది ఎకరాలతో అమ్రాబాద్ ఫారెస్ట్ పర్యాటకంలో దూసుకుపోతున్నాయి. దట్టమైన అరణ్య ప్రాంతాలు కూడా సకల సదుపాయాలతో అలరారుతున్నాయి. మారుమూల ప్రాంతాలు సైతం సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. పర్యాటకం అభివృద్ధి చెందితే సమీప ప్రాంత ప్రజలందరికీ మేలు జరిగినట్టే. అందుకు ఉమ్మడి మహబూబ్నగర్ పర్యాటక రంగమే ఉదాహరణ.
కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో సాహస క్రీడలతోపాటు ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచే అనేక సదుపాయాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి గోల్బంగ్లాను పునరుద్ధరించి.. అందంగా తీర్చిదిద్దారు. కేసీఆర్ అర్బన్ పార్కులో నక్షత్రవనాలు, చిల్డ్రన్స్ పార్క్, టూరిస్టులు బస చేసేందుకు టెంట్లు, బోటింగ్, సైక్లింగ్, రెయిన్ యాక్టివిటీస్ వంటివి అనేకం ఏర్పాటు చేశారు. రూ. 13 కోట్లతో మినీ శిల్పారామాన్ని కూడా నిర్మించారు. అంతేకాదు రూ. 48.99 కోట్ల వ్యయంతో నెక్లెస్ రోడ్డు, ఐలాండ్స్ సుందరీకరణ పనులు కూడా చేపట్టారు.
అహో.. అమ్రాబాద్!
అడవి దారి తెలిసినోళ్లు. జంతువుల అరుపులు ఎరిగినోళ్లు. వాగులూ వంకల పుట్టుపూర్వాల నాడి పట్టినోళ్లు. ఏ బాట ఎక్కడికి వెళుతుందో చెప్పేటోళ్లు. ఏ అడుగు ఏ జంతువుదో వివరించేటోళ్లు. కొండలు, కోనలతో స్నేహం చేసేటోళ్లు. వాళ్లే అడవిలో నివాసాలున్న బిడ్డలు. ఇప్పుడు వాళ్లంతా అమ్రాబాద్ ఫారెస్ట్ పర్యాటకానికి ఆత్మీయులయ్యారు. నేచర్ గైడ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పర్యాటకులకు అడవి సంస్కృతి, జంతువుల భాషపై అవగాహన కల్పిస్తున్నారు. అసలు ఇట్లాంటి ఉద్యోగం ఒకటి తమకు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, అమ్రాబాద్ ఫారెస్ట్ను ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని గర్వంగా చెబుతున్నారు. ఇప్పటికే 13 మంది అడవి బిడ్డలు నేచర్ గైడ్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్నరు.
తెలంగాణ వచ్చాక ఈ అటవీ ప్రాంతం చాలామందికి ఉపాధినిస్తున్నది. అమ్రాబాద్తోపాటు చుట్టపక్కల గ్రామాల వృద్ధి సాధ్యమైంది. అమ్రాబాద్ ఫారెస్ట్ పేరు వింటే ఇప్పుడు గుర్తొచ్చేది.. సఫారీ. ఔను జంగిల్ను క్షుణ్నంగా వీక్షించే అవకాశం కల్పించిన ఈ సఫారీ సేవలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతానికి టూరిస్టుల రాక పోకలు పెరిగాయి. టీ స్టాల్స్, కిరాణా దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జీలు, రవాణా వాహనాలు పెరిగాయి. ఇలా అనేక ఆర్థిక కార్యకలాపాలతో వ్యాపారం పుంజుకున్నది. మన్ననూర్ నుంచి మొదలయ్యే సఫారీ సేవలకు వచ్చే వారికోసం కాటేజీలు ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఈగలపెంట వద్ద రూ.25.87 కోట్లు, ఫరహాబాద్ మన్ననూర్ వద్ద రూ. 13.81 కోట్లు, మల్లెల తీర్థం వద్ద రూ.5.35కోట్లతో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
కొత్త కొలువులు
స్థానిక మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా జ్యూట్ బ్యాగ్ల అల్లికలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. పర్యాటకులకు ఆ సంచులను విక్రయిస్తూ వాళ్లంతా నాలుగురాళ్లు సంపాదించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఆరోగ్య సేవలు అందించేందుకు ముందుకొస్తున్న ఎన్జీవోలకు, కంపెనీలకు షెల్టర్లు ఏర్పాటుచేసి.. స్థానిక మహిళలకు నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేస్తున్నారు. “ఒకప్పుడు ఈ ప్రాంతం వైపు చూసెటోళ్లే లేకుండే. మేం కూడా ఇదొక పర్యాటక కేంద్రం అవుతుందని ఊహించలేదు. అడవిలో తిరిగి తేనె, చింతపండు, నల్లారి గడ్డలు సేకరించేటోళ్లం. వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో పొట్ట గడుపుకొనేటోళ్లం. ఇప్పుడు అమ్రాబాద్ ఫారెస్ట్ పర్యాటకం ఊపందుకోవడంతో మాలో చాలామందికి నేచర్ గైడ్గా ఉద్యోగం లభించింది. అనేక విషయాలను నేను అనర్గళంగా చెబుతుంటే.. నా ప్రతిభకు మెచ్చి ఉద్యోగాలు సైతం ఆఫర్ చేస్తున్నరు. ఆ అవకాశమేదో నా స్నేహితులకు ఇప్పించి.. ఉపాధి దొరికేలా చేస్తున్నా. పట్టపగలు కూడా చీకట్లు అలుముకునే ఈ ప్రాంతంలో పర్యాటకం పేరుతో కేసీఆర్ వెలుగులు నింపారు. మా నాన్నకు నెలకు 2 వేల పింఛన్, నాకు 30వేల రైతుబంధు వస్తున్నది. నేచర్గైడ్గా నెలకు మరో పదివేల వరకూ సంపాదిస్తున్నా” అని సగర్వంగా చెప్పాడు వెంకటేశ్వర బావి నివాసి ఉడతనూరి ప్రశాంత్. స్వరాష్ట్రం సాధించుకున్నాక మన వనరులు, మన ఉద్యోగాలు మనకే అనే విషయం నిజమైందని సంబురపడ్డాడు.
మళ్లీ సారే రావాలి..
“కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో నైట్ వాచ్మన్గా పనిజేస్తున్న. నెలకు 9 వేల జీతం. 5 ఏండ్ల నుంచి ఇదే ఉపాధి. ముగ్గురు కొడుకులను చదివించిన. రెండున్నర ఎకరాలకు రైతుబంధు వస్తది. గొర్లు కూడా ఇచ్చిండ్రు. చిన్నప్పుడు మా నాయనతో చెల్కకు పోయేటప్పుడు అడవిలో తిరిగేవాణ్ని. అందుకే నాకు అడవంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఉమ్మడి పాలనలో ఎవ్వరూ చెరువులు, చెల్కలు బాగుండాలని కోరుకోలేదు. కేసీఆర్ సార్ సీఎం అయ్యాక మొక్కలు నాటడంపై అవగాహన పెంచిండు. ఇప్పుడు పార్కులో సఫారీ సేవలు కూడా ప్రారంభించిండ్రు. పర్యాటకుల సందర్శనలు పెరిగాయి. రోజూ 30 మంది మహిళా కూలీలు పనులకు వస్తరు. ఫుడ్ కోర్టులతో వ్యాపారులు, రవాణాతో వాహనదారులు ఉపాధి పొందుతున్నారు. కేసీఆర్ సార్ మళ్లీ సీఎం అయితేనే ఇంకింత అభివృద్ధి జరుగుతది.” అంటాడు బొక్కలోన్పల్లి వాసి వెంకట రాములు.
“అమ్రాబాద్ ఫారెస్ట్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వం ముందున్నది. దాంతోపాటే స్థానికులకు వైద్య సేవలు, సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నది. ఇక్కడి పర్యాటకుల కోసం ట్రెక్కింగ్, సఫారీ సేవలు అందిస్తున్నం. ఫరహాబాద్, అమ్రాబాద్ వ్యూ పాయింట్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. అటవీ ఆహార ఉత్పత్తులను సేకరించే క్రమంలో పక్షులకు, జంతువులకు ఎలాంటి హానీ కలిగించకుండా.. స్థానికులకు మెలకువలను నేర్పిస్తున్నాం. ఇది కేవలం పర్యాటక ప్రాంతమే కాదు. ఆర్గానిక్ ఉత్పత్తులూ ఇక్కడ లభిస్తాయి. ప్రకృతిని కాపాడుకోవాలనే సంకల్పం చాలా గొప్పది. అది కేసీఆర్తోనే సాధ్యమైంది” అని వివరిస్తారు టైగర్ ప్రాజెక్టు ఎడ్యుకేషన్ ఆఫీసర్ జీ శ్వేత.
పర్యాటకానికి నిధుల వరద
తెలంగాణ పర్యాటకరంగ ఘనత ప్రపంచమంతటా మార్మోగుతున్నది. విదేశీ యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. ఈ పదేండ్లలో 65.77 కోట్ల దేశీయ పర్యాటకులు, 2.67 లక్షల మంది విదేశీయులు మన ఆతిథ్యాన్ని ఆస్వాదించారు. మరోవైపు ప్రభుత్వం నాగార్జునసాగర్ దగ్గర రూ.65 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.13.47 కోట్లతో వసతులు కల్పించింది. లక్నవరం వద్ద 27.67 కోట్లతో అదనపు సౌకర్యాలు తీసుకొచ్చింది.
తాడ్వాయిలో రూ.9.36 కోట్లు, గట్టమ్మ గుట్ట వద్ద రూ.7.36 కోట్లు, మల్లూరు వద్ద రూ.4.20 కోట్లు, బొగత జలపాతం వద్ద రూ.11.64 కోట్లు, సోమశిల వద్ద రూ.20.87 కోట్లు, సింగోటం రిజర్వాయర్ వద్ద రూ.7.84 కోట్లు వ్యయం చేసి సకల సదుపాయాలు సిద్ధం చేసింది. సిద్దిపేట కోమటి చెరువు, లక్నవరం, ఖమ్మంలో కొత్త సస్పెన్షన్ వంతెనలు అభివృద్ధి చేసింది. ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలకు కొత్త జీవం పోసింది. అనేక వసతులు కల్పించింది. చారిత్రక ప్రాంతాలతో పాటు యాదాద్రి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను దేశం గర్వించే స్థాయిలో నిలబెట్టారు కేసీఆర్. వీటితోపాటు కొండపోచమ్మ సాగర్, మిడ్ మానేరు, కాళేశ్వరం ప్రాజెక్టులు అద్భుత పర్యాటక ప్రాంతాలుగా వెలుగొందుతూ తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ టూరిజం డెస్టినేషన్గా నిలబెట్టాయి. ఇంతకు మించిన విజయం ఏం ఉంటుందీ?
ప్రపంచం మెచ్చింది..
నీతి ఆయోగ్, ఎకనమిక్ సర్వేలు తమ నివేదికల్లో తెలంగాణ పర్యాటక ప్రగతిని ప్రశంసించిన సందర్భాలు అనేకం. ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. టూరిజం అవార్డులను సైతం దక్కించుకున్నది. క్రీడా పర్యాటకం విషయానికొస్తే.. గోల్ఫ్ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నది. భూదాన్ పోచంపల్లిని ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. అద్భుత శిల్పకళకు చిరునామాగా నిలిచిన రామప్ప.. యునెస్కో గుర్తింపు సాధించింది. హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్.. ప్రతి జిల్లా పర్యాటకులతో కళకళలాడుతున్నది.
ఇక, సీజన్కు తగిన దర్శనీయ ప్రాంతాలు కోకొల్లలు. అందుకే విదేశీయులు అధికంగా ఇక్కడికి వస్తుంటారు. అలనాటి వారసత్వ సంపదను కాపాడుతూనే కొత్త పర్యాటక ప్రాంతాలను తెరపైకి తెస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం. వినూత్న అనుభూతిని కోరుకునేవారి కోసం బోటింగ్, ట్రెక్కింగ్, సఫారీ తరహా సేవలు అందిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 55కి పైగా హరిత టూరిజం హోటల్స్, వసతులు ఏర్పాటు చేసింది. 40కి పైగా టూరిజం బస్సులు, 140కి పైగా బోట్స్ నడుపుతున్నది. గోల్కొండ, హుస్సేన్ సాగర్, వరంగల్ కోటల వద్ద సౌండ్ అండ్ లైట్ షోలను నిర్వహిస్తూ పర్యాటకులకు వినోదాల విందు వడ్డిస్తున్నది. నిజమే, ఇంత చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ప్రాంతం మరొకటి ఉండకపోవచ్చు.
…? ఇడుమాల కిరణ్ కుమార్
– బందిగే గోపి