హైదరాబాద్ : దేశ వారసత్వ సంపదకు ప్రతీకగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ‘వరల్డ్ హెరిటేజ్ కమిటీ’ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని హంగులతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసి పరిరక్షించాలని పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్, సంబంధిత, అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని పరిరక్షించుకునే చర్యల్లో భాగంగా వెంటనే ఆలయ బౌండరీలు ఏర్పాటు చేయాలన్నారు.
అక్కడ సందర్శకుల రద్దీని పరిగణలోకి తీసుకొని సమీకృత పర్యాటక ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. హెరిటేజ్ కమిటీ నిబంధనలను అనుసరించి పరిసర ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి దేవాలయాలు, ఇతర కట్టడాలు పరిరక్షింపబడేలా ‘పాలంపేట ప్రత్యేక ప్రాంత అభివృద్ధి అథారిటీని’ రూపొందించుకోవాలని సూచించారు. రామప్ప సరస్సు బండ్ పటిష్ట పరచి, సాగునీటి కాలువలు, ఇతర పనులను పటిష్టమైన ఇంజినీరింగ్ ప్రణాళికతో అభివృద్ధి చేయాలన్నారు. స్థానిక ప్రజలు, పూజారుల సలహాలు తీసుకొని దేవాలయ వారసత్వ సంపదను మరింత బలోపేతం చేసేందుకు వినియోగించుకోవాలన్నారు.
ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. అనుబంధ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి డిసెంబర్ ఒకటిలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఎట్టి పరిస్థితిలో జాప్యం చేయొద్దని ఆదేశించారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, పట్టణ ప్రణాళిక శాఖ డైరెక్టర్ విద్యాధరరావు, ఇరిగేషన్ సీఈ విజయ భాసర్ రెడ్డి, టీఎస్టీడీసీ ఎండీ మనోహర్, పురావస్తు శాఖ అధికారి స్మిత తదితరులు పాల్గొన్నారు.