హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా తన సొంత నిధులతో, ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఒక అంబులెన్స్ను అందజేశారు. ఈ అంబులెన్స్ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తాను కేటీఆర్ అభినందించారు. ఈ అంబులెన్స్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా హైదరాబాద్ పట్టణంలోని ఆయా నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రులకు అత్యవసర పరిస్థితుల్లో రోగులను చేరవేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ఉప్పల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉప్పల స్వప్న, ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయి తేజ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ సికింద్రాబాద్ జోన్ నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.