హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోలు, సరఫరాకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వ గ్యారంటీని ఎత్తివేయాలని తెలంగాణ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కు విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్కోలు, జెన్కోలకు సంబంధించిన ఈ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్యారంటీని ఎఫ్ఆర్బీఎం పరిధిలో చూపుతుండటంతో రాష్ర్టాలకు అన్యాయం జరుగుతున్నదని దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు సంస్థల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గురువారం పీఎఫ్సీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సమావేశం శనివారం వరకు జరగనున్నది.
శుక్రవారం పీఎఫ్సీ సీఎండీ రవీందర్సింగ్ ధిల్లాన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తెలంగాణ తరఫున ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అన్ని రాష్ర్టాల్లోని జెన్కోలు, ట్రాన్స్కోలు లాభాల్లోనే ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా 95% డిస్కంలు నష్టాల్లోనే ఉన్నాయని సునీల్శర్మ, ప్రభాకర్రావు పేర్కొన్నారు. విద్యుత్తు సంస్థలకు రుణాలివ్వడంలో స్థానిక డిస్కంల ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న తాజా నిర్ణయం ట్రాన్స్కోలు, జెన్కోలపై దుష్ప్రభావం చూపుతుందని పీఎఫ్సీ దృష్టికి తీసుకొచ్చారు.
అందుకే డిస్కంలతో జెన్కోలు, ట్రాన్స్కోలను ముడిపెట్టవద్దని, ఆ సంస్థల ఆర్థిక పరిస్థితిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభాకర్రావుతోపాటు దక్షిణాది రాష్ర్టాల సీఎండీలు విజ్ఞప్తి చేశారు. విద్యుత్తు సంస్థలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును తగ్గించాలని కోరారు. దీంతో ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పీఎఫ్సీ సీఎండీ, డైరెక్టర్లు తెలిపారు.