హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల సాధికారత, స్వావలంబన, రక్షణకు కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో లైన్ఉమెన్ ఉద్యోగాలు కల్పించడం మహిళా సాధికారత పట్ల సర్కారు నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
‘మహిళా వేధింపులపై గళమెత్తుదాం’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్లో ట్రూ కాలర్, న్యూస్-18 నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వేధింపులు తట్టుకోలేక దేశంలో అనేకమంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదని చెప్పారు. టెక్నాలజీ, వేధింపులు కవల పిల్లలని చెప్తూ.. మహిళలు వేధింపులకు భయపడకుండా స్వేచ్ఛగా సోషల్ మీడియాను వినియోగించుకోవాలని సూచించారు.
వేధింపులు ఎదురైతే అధైర్యపడకుండా, తమకు వచ్చిన అసభ్యకర మెసేజ్లు, ఫొటోలు, ఇతర లింక్లను స్రీన్షాట్ తీసుకొని, వాటిని పోలీసులకు అందించాలని సూచించారు. సాంకేతిక ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. త్వరగా చర్యలు చేపట్టే వీలుంటుందన్నారు. మౌనంగా ఉన్నంతకాలం ఆకతాయిల ఆగడాలు కొనసాగుతాయని, ఒకసారి గొంతు విప్పితే.. ఒక అబ్బాయి కూడా మహిళల జోలికి వచ్చే ధైర్యం చేయడని చెప్పారు.
తెలంగాణలో షీటీమ్స్ పనితీరు దేశానికే ఆదర్శనీయమని కవిత పేర్కొన్నారు. ఆకతాయిలు టీజ్ చేసిన నిమిషాల్లోనే షీటీమ్లు ప్రత్యక్షమవుతున్నాయని చెప్పారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో షీటీమ్లు, మహిళా పోలీసుస్టేషన్లు, స్పెషల్ సైబర్ సెల్ ఏర్పాటు చేసిందని తెలిపారు. మహిళలపై సైబర్ వేధింపులకు ప్రత్యేక చట్టాలు ఉంటే, మరింత వేగంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీడీలు చుడుతున్న మహిళలు కూడా ల్యాప్టాప్లు వాడే రోజులు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో 2026 లోపు ఆ పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూస్-18 సీనియర్ పొలిటికల్ ఎడిటర్ మార్యా షకీల్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, బాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత పారుపల్లి కశ్యప్ పాల్గొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, మహిళా భద్రత పటిష్ఠంగా ఉన్నందునే ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని చెప్పారు. సోమవారం హైదరాబాద్లో ట్రూ కాలర్, న్యూస్-18 ఆధ్వర్యంలో ‘మహిళా వేధింపులపై గళమెత్తుదాం’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్గా మాట్లాడుతూ.. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, తెలంగాణలో మహిళాభ్యున్నతికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నామని వివరించారు.
సామాజిక మాధ్యమాల్లో వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్టు పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ కేసులను ప్రత్యేక కోణంలో చూస్తున్నామని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించినప్పుడే మహిళలపై వేధింపులను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే కుటుంబ విలువలను నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. ఐటీతో పాటు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.