KCR Kaanuka Scheme | హైదరాబాద్, జూలై18 (నమస్తే తెలంగాణ): మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్ కానుక పథకం దరఖాస్తులకు గురువారంతో గడువు ముగియనున్నది. అత్యంత నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది. వీటిలో క్రిస్టియన్ మైనార్టీ మహిళలకు 2 వేలు, ఇతర మైనార్టీ మహిళలకు 18 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నట్టు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలిపింది.
ఈ పథకానికి 21-55 ఏళ్ల వయసు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయంతో తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేద మైనార్టీ మహిళలు అర్హులు. ఆధార్కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హతల పత్రాలు, పాస్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు సూచించారు.