హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యంతరాలకు రేపటితో గడువు ముగియనున్నది. శుక్రవారం చివరిరోజు కావడంతో అభ్యర్థుల నుంచి వినతులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రూప్-1 వంటి పరీక్షలకు ప్రిలిమ్స్ కీ వెబ్సైట్లో పెట్టిన తర్వాత సాధారణంగా మూడురోజులు మాత్రమే సమయం ఇస్తారు. కానీ తొలిసారిగా టీఎస్పీఎస్సీ ఐదురోజులు సమయం ఇవ్వడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా కీలో ఎటువంటి అభ్యంతరాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. టీఎస్పీఎస్సీకి సైతం గతంతో పోలిస్తే తక్కువ అభ్యంతరాలు వచ్చినట్టు తెలిసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం పొడిగించే అవకాశం ఇక లేదని టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థులు చివరిరోజును సద్వినియోగం చేసువాలని కమిషన్ సూచించింది. తెలంగాణ గ్రూప్-1లో 503 పోస్టులకు 2,86,051 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఒక్కో ఉద్యోగానికి 50 మంది చొప్పున మెయిన్స్కు క్వాలిఫై చేయనున్నారు. అంటే.. మొత్తం 25,150 మంది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించనున్నారు.