హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని(Spiritual Day) ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy)తెలిపారు. మామిడి తోరణాలు, పూలు, విద్యుత్తు దీపాలతో ఆలయాలను అలంకరించడంతోపాటు వేద పారాయాణం, అభిషేకాలు, హోమాలు, హరికథలు, కవి సమ్మేళనం, సత్కారాలు, శాస్త్రీయ సంగీతం, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
కొత్తగా 2,043 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం ( Dhupa Deepa Naivedya scheme )అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తుండగా కొత్త వాటితో కలుపుకుని మొత్తం 6,661 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు కానుందన్నారు. ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామని సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే దీన్ని అమలు చేస్తామని తెలిపారు.
ఆధ్మాత్మిక దినోత్సవం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు వివరించారు. రేపటి నుంచి భక్తులకు అందుబాటులోకి మిల్లెట్ ప్రసాద సేవలను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహా స్వామి వారి బంగారం, వెండి నాణేల అమ్మకం, ఆన్ లైన్ టికెట్ సేవల ప్రారంభం, రాయగిరి వేదపాఠశాల నిర్మాణానికి భూమిపూజ, అన్నదాన సత్రం ప్రారంభం, ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలో కల్యాణ మండపాన్ని ప్రారంభించనున్నటుల్ వివరించారు.