Deeksha Divas | నవంబర్ 29. తెలంగాణ మర్చిపోలేని రోజు. ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైన రోజు.
తెలంగాణ మలి దశ ఉద్యమానికి బీజం పడిన రోజది. రాష్ట్ర సాధన దిశను మార్చిన రోజది. పోలీసుల ఎత్తులు, ఉద్యమకారుల పైఎత్తులకు సాక్ష్యంగా నిలిచిన రోజది. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని తెలంగాణ నినదించిన రోజది. తెలంగాణను ఏకం చేసిన రోజది. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెల్లారిన రోజది. నిరాహార దీక్షతో ఆనాటి ఢిల్లీ కాంగ్రెస్పై కేసీఆర్ ఆమ‘రణా’నికి దిగిన రోజు ఇదీ.
సరిగ్గా నేటితో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్షకు దిగి 14 ఏండ్లు పూర్తయ్యాయి. మరోసారి నవంబర్ 29 వచ్చింది. మరి నాటికి, నేటికీ ఏం మారింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మేలిమి బంగారంగా మార్చుకున్నాం. అభివృద్ధి చేసుకున్నాం. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు సంక్షేమ ఫలాలు అనుభవించాయి. సిరిసంపదలతో అలరారుతున్న తెలంగాణను పీక్కు తినేందుకు రాబందులు వస్తున్నాయి. వెలుగులీనుతున్న తెలంగాణపై చీకట్లు కమ్ముకొస్తున్నాయి. మరోసారి తెలంగాణ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఆనాడు కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష స్ఫూర్తిగా నేడు ప్రతి తెలంగాణ బిడ్డ గర్జించాలె. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో నవంబర్ 30న మరోసారి మేల్కోవాలె. తెలంగాణను కాపాడుకోవాలె.
అనూహ్య పరిణామాలెన్నో..
ఉద్యమ సారథి కేసీఆర్ స్ఫూర్తిగా మరోసారి కొట్లాడాల్సిన ఈ సమయంలో ఆనాడు ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. క్షణక్షణం ఉత్కంఠభరితంగా కేసీఆర్ ఆనాటి ప్రయాణాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ మరోసారి మననం చేసుకోవాలె. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 28న హైదరాబాద్ నుంచి కరీంనగర్కు చేరుకున్నారు. కేసీఆర్ ఆమరణదీక్షకు కూర్చోకముందే ఆయన్ను అరెస్టు చేయాలని ఉమ్మడి పాలకులు వ్యూహం రచించారు. ముందురోజు రాత్రే ఈ ప్లాన్ను అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు కుట్రను ఛేదించారు. నవంబర్ 28 అర్ధరాత్రి నుంచే పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు కరీంనగర్కు బారులుతీరారు. అరెస్టులు, గృహ నిర్బంధాలు, అనూహ్య పరిణామాలు ప్రతిక్షణం తెలంగాణను ఉత్కంఠకు గురిచేశాయి.
2009 నవంబర్ 28
హైదరాబాద్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్ కరీంనగర్కు బయలుదేరారు. అదే రోజు అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. సీఆర్పీఎఫ్, రిజర్వ్ఫోర్స్.. ఇలా ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వేల మంది పోలీసులు కేసీఆర్ ఇంటిని చుట్టుముట్టారు. ఇదే తరహాలో ఉద్యమకారుల దండు కేసీఆర్ ఇంటికి రక్షణ కవచంగా నిలిచింది. కేసీఆర్ ఇంటికి చేరుకున్న బలగాలు లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాయి. ‘ఇంట్లోకి వస్తే ఆత్మాహుతి చేసుకుంటాం’ అని తెగేసి చెప్పటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కేసీఆర్ను అరెస్టు చేస్తారా? ఆమరణ నిరాహారదీక్ష చేయనివ్వరా? ఉప్పురాయోలే ఉన్నోణ్ని ఉండనీయరా?’ ఇలాంటి అనేక అనుమానాలతో క్షణమొక యుగంలా గడిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ నిద్ర లేని రాత్రిని గడిపింది.
2009 నవంబర్ 29
29 నవంబర్ 2009.. జై తెలంగాణ నినాదాలతో తెల్లారింది. కరీంనగర్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు కేసీఆర్ ఇంటిని రౌండప్ చేశారు. వలయాలు.. వలయాలుగా కేసీఆర్కు రక్షణ కవచంగా ఉద్యమశ్రేణులు పోలీసులను ప్రతిఘటించాయి. దీంతో పోలీసులు తాత్కాలికంగా వెనక్కితగ్గారు.
రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ సిద్దిపేటలో చేపట్టే ఆమరణ నిరాహార దీక్షాస్థలికి బయలుదేరారు. కరీంనగర్ నుంచి సిద్దిపేట వరకు అడుగడుగునా వాహనాలే. కేసీఆర్కు జన నీరాజనం పలికింది. వేలాది మంది కార్యకర్తలు, ఉద్యమకారులు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేస్తున్నారు. టైర్లల్లో గాలి తీస్తూ వాహనాల సంఖ్యను తగ్గిస్తున్నారు. కేసీఆర్ ఇంటి నుంచి అల్గ్గునూర్ చౌరస్తా వరకు 4 కిలోమీటర్ల దూరమే. కానీ దాదాపు 1500 వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలను అల్గ్గునూర్ చౌరస్తాలో నిలిపివేశారు. అల్గ్గునూర్.. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ కూడలి కావడంతో మూడు వైపులా చెక్పోస్టులు పెట్టి రోడ్డు మూసివేశారు. కరీంనగర్ సుభాష్నగర్లో కేసీఆర్ కాన్వాయ్ను దారిమళ్లించారు. కేసీఆర్ వాహనంతో పాటు పోలీసు సిబ్బంది వాహనాలను మానేర్ వంతెన దాటించారు. మానేరు వంతెనకు ముందు రెండు చెక్పోస్టులు పెట్టి.. కార్యకర్తలు, నాయకుల వాహనాలను అడ్డుకున్నారు. రెండు ఎస్కార్ట్ వాహనాలతో పాటు కేసీఆర్ వాహనాన్ని మాత్రమే ముందుకు పంపారు. మీడియాను నిలువరించారు.
అల్గునూర్ చౌరస్తా నుంచే కేసీఆర్ తిరుగుబాటు
అల్గ్గునూర్ చౌరస్తా వద్ద కేసీఆర్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. ఆయనను వాహనంలో నుంచి పోలీసులు కిందికి దింపారు. తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని, ఇక్కడే దీక్షకు దిగుతానని కేసీఆర్ రోడ్డుమీదే బైఠాయించారు. ప్రజలు జై తెలంగాణ .. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. తమ నాయకుడిని పోలీసుల చెర నుంచి విడిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కాలికి స్వల్ప గాయమైంది. అప్పటికే అల్గ్గునూర్ చౌరస్తాను పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. సమైక్య సర్కార్ పథక రచనను అమలు చేసేందుకు పోలీసులు యథాశక్తి సాయపడ్డారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ను అక్కడ్నే విడిచిపెట్టి సీఎం కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి, డాక్టర్ విజయ రామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కన్నెబోయిన రాజయ్యయాదవ్లను అరెస్ట్ చేసి బస్సులో తరలించేందుకు ప్రయత్నించారు.
అల్గునూర్ టు ఖమ్మం వయా వరంగల్
ముందు వెనుకా పదుల సంఖ్యలో పోలీసు వాహనాలతో అల్గ్గునూర్ చౌరస్తా నుంచి కేసీఆర్ ఉన్న ప్రత్యేక వాహనం (పోలీస్ బస్సు) బయలుదేరింది. దారిపొడవునా కర్ఫ్యూ తరహా పరిస్థితులు. ‘ఇంకో రెండు గంటల వరకు రోడ్ల మీద మరో వాహనం నడవటానికి వీల్లేదు. రోడ్లకు ఇరువైపులా ఒక్క మనిషి ఉండటానికి వీల్లేదు’ అని అన్ని పోలీస్ స్టేషన్లకు స్టేట్ హెడ్క్వార్టర్స్ నుంచే వైర్లెస్ మెసేజ్.
ఒక్క హుకూంతో రోడ్లన్నీ నిర్మానుష్యం. ‘సిద్దిపేట ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్న కేసీఆర్ను పోలీసులు అరెస్టు చేశారు’ అనే వార్త తెలంగాణ అంతటా వ్యాపించింది. కేశవపట్నం, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్పర్తి రోడ్లపైకి క్షణాల్లో ప్రజలు చేరుకున్నారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ హసన్పర్తికి చేరువలో ఉందనగానే కాకతీయ విశ్వవిద్యాలయం, ఎస్డీఎల్సీఈ గేట్లకు తాళాలు. భారీ బందోబస్తు.. మరోవైపు వరంగల్ కోర్టు సముదాయం, కేంద్ర కారాగారం వద్దకు వేలాది మంది ఉద్యమకారులు చేరారు. కేసీఆర్ను వరంగల్ కోర్టులో హాజరుపరిచి అక్కడి సెంట్రల్ జైలుకు తరలిస్తారని వారు భావించారు (నిజానికిఅల్గ్గునూర్లో కేసీఆర్ను అరెస్ట్ చేసే ముందు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్డర్ అదే). కానీ వరంగల్లో ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిర్ధారించుకున్న తరువాత పోలీసులకు డైరెక్షన్ మారింది. పోలీసులు క్షణాల్లో వ్యూహాన్ని మార్చారు. కేసీఆర్ వాహన శ్రేణిని దారిమళ్లించారు. ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్రావు విగ్రహం (కాకతీయ యూనివర్సిటీ, ఎస్డీఎల్సీ) నుంచి కేసీఆర్ వాహన శ్రేణి మెరుపు వేగంతో దూసుకెళ్లింది. కాజీపేట మీదుగా హైదరాబాద్ తరలిస్తారని ప్రచారం జోరందుకున్నది. ఆ తర్వాత కడిపికొండ వంతెన మీదుగా భట్టుపల్లి ఉర్సుగుట్ట.. నాయుడు పంప్ మీదుగా ఖమ్మం రోడ్.. వర్ధన్నపేట, రాయపర్తి మీదుగా తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ను రాజమండ్రికి లేదా సూర్యాపేటకు తరలిస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ తర్వాత ఉద్యమకారులకు చిక్కకుండా తొర్రూర్, మరిపెడ మీదుగా ఖమ్మానికి తరలించారు.
న్యాయమూర్తి నివాసం నుంచి ఖమ్మం సబ్జైలుకు
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఖమ్మం చర్చి కాంపౌండ్లో ఉన్న ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీరామమూర్తి నివాసానికి (ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో) కేసీఆర్ను తీసుకెళ్లారు. అప్పటికే పథకం ప్రకారం ఖమ్మం పోలీస్ స్టేషన్లో కేసీఆర్ సహా మిగతా నాయకులపై రాజద్రోహ నేరం (ఐపీపీ 120బీ)తో పాటు సెక్షన్ 143, 153 (ఏ), 188, 505, 506, 114, 117 సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఉద్రిక్తతలు, ఉత్కంఠ, బలగాలు, జాగిలాల మధ్యే అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు.. అనంతరం సబ్జైల్కు తరలించారు.
అక్కడి నుంచే ఆమ‘రణం’
తనను పోలీసులు ఎక్కడైతే అరెస్టు చేశారో అక్కడి నుంచే తన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం అయిందని కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి తెలంగాణ నిప్పుల కొలిమై మండింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలయ్యాయి. విద్యార్థులు ప్రత్యక్షంగా సమరశంఖం పూరించారు. మరోవైపు అల్గ్గునూర్ నుంచి పోలీసు వాహనాన్ని కేటీఆర్ అనుసరిస్తూ వచ్చారు. కాకతీయవర్సిటీ సెకండ్ గేట్ వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన విద్యార్థుల రక్షణ వలయంలోకి వెళ్లారు. అక్కడి నుంచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. మరోవైపు తన్నీరు హరీశ్రావు సిద్దిపేటలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న వేదికపై దీక్షకు దిగారు. కేసీఆర్ అరెస్టుతో రగిల్చిన అగ్గి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ నేల ఉద్యమ పిడికిలైంది. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నారు. దీంతో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలోకి దిగారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఖమ్మం సబ్జైల్ నుంచి ఖమ్మం ఆసుపత్రి.. అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు చేరింది. నిమ్స్లో ఆరోగ్యం క్షీణిస్తున్నా.. ‘పచ్చి గంగ అయినా ముట్టను. ప్రాణం పోయినా సరే రాష్ర్టాన్ని సాధించి తీరుతాను’ అని కేసీఆర్ శపథం చేశారు. ఢిల్లీ గద్దె వణికిపోయింది. తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యతను కేసీఆర్ కల్పించారు. తెలంగాణ నిలిచి గెలిచింది. దశాబ్దాల కల సాకారం అయ్యింది.
జై తెలంగాణ.. జై జై తెలంగాణ.