High Court | వ్యవసాయ యూనివర్సిటీ , మార్చి 24: ఉద్యమాలు వృథా అయ్యాయి. విద్యార్థుల నినాదాలు అరణ్య రోదనలే అయ్యాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హైకోర్టు వద్దు మొర్రో అని విద్యార్థులు, మేధావులు మొత్తుకున్నా పట్టించుకోని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల కోడ్ను విస్మరించి మరీ రాత్రివేళ పనులు ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని దాదాపు 100 ఎకరాల్లో నూతన హైకోర్టు నిర్మాణ పనులు మొదలయ్యాయి. విషయం తెలిసిన వర్సిటీ విద్యార్థులు వివరాలు అడిగే ప్రయత్నం చేస్తే కేసులు, అరెస్టుల వరకు రావొద్దంటూ పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ పనులపై వర్సిటీ అధికారులు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. పనులు జరుగుతున్న ప్రదేశానికి పది అడుగుల దూరంలోని ఔషధ విభాగం సమావేశపు హాలులో తేనెటీగల పెంపకంపై రైతుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి వర్సిటీ ఉపకులపతి నీరజా ప్రభాకర్ హాజరైనా పనులపై ప్రశ్నించలేదు. విషయం తెలిసిన పలు ప్రజాసంఘాలు స్పందించాయి. సోమవారం పనులను అడ్డుకునేందుకు పిలుపునిచ్చాయి. హైకోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గతంలో విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు చర్చలు జరుపుతామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతమెంతో ఘనం
40 ఏండ్ల చరిత్ర కలిగిన రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ భూముల్లోని అటవీ సంపద ఇప్పుడు ధ్వంసమైపోతున్నది. విలువైన వృక్ష సంపద నాశనం అయిపోతున్నది. పోలీసుల పహారాలో భారీ యంత్రాలతో చెట్లను కూల్చివేస్తూ హైకోర్టు నిర్మాణానికి అనువుగా భూమిని చదునుచేస్తున్నారు. పనులను ఎవరూ అడ్డుకోకుండా పోలీసులను పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం మరో 100 ఏండ్ల వరకు సేవలు అందించగలదని, అక్కడే రూ. 100 కోట్లతో వసతులు కల్పిస్తే సరిపోయేదని నిపుణులు చెప్తున్నారు. హైకోర్టు నిర్మాణం ద్వారా అటు రైతులకు, ఇటు వ్యవసాయ పరిశోధనలకు, వర్సిటీ విద్యార్థులకు అపారనష్టం జరుగుతుందని వాపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకే వెళ్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టుకు కేటాయించిన 100 ఎకరాల బయోడైవర్సిటీ భూముల విలువ రూ. 6 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.