హైదరాబాద్/ నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో నేడు తేలిపోనున్నది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. ఇందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న గిడ్డంగులశాఖ గోడౌన్లో లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. విశాలమైన కౌంటింగ్ హాల్లో మొత్తం 21 టేబుళ్లపై ఏకకాలంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలు ఈనెల 3న జరగగా, రికార్డు స్థాయిలో 93.13శాతం పోలింగ్ నమోదైంది. 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి.
ఈ ఓట్లకు అదనంగా 680 మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఉదయం 7.30గంటలకు స్ట్రాంగ్రూం ఓపెన్ చేసి ఈవీఎంలను లెక్కింపు హాల్కు తరలిస్తారని ఆయన వివరించారు. ప్రతి రౌండ్లో ఓట్ల లెక్కింపులో భాగంగా.. రెండు పోలింగ్స్టేషన్ల ఓట్ల లెక్కింపును ఎన్నికల పరిశీలకుడు క్రాస్చెక్ చేస్తారని తెలిపారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు అనంతరం ఏవైనా ఐదు పోలింగ్ స్టేషన్ల వీవీప్యాట్ ఓట్లను లెక్కిస్తారు. వీవీ ప్యాట్ ఓట్లు ఈవీఎంల ఓట్ల లెక్కింపుతో సరిపోయాయో లేదో పరిశీలకుడు చెక్ చేస్తారని వికాస్రాజ్ వివరించారు. ఓట్ల లెక్కింపు కోసం వందమంది సిబ్బందిని, వారికి సహాయకులుగా, ఇతర అవసరాల కోసం మరో 150మందిని నియమించారు.
మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారంటూ దాదాపుగా అన్ని సర్వేలు ప్రకటించాయి. ఈ నెల 3న పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. అన్నింటిలోనూ టీఆర్ఎస్ ముందుండగా.. రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోరాడుతున్నాయని పలు సంస్థలు తమ ఎగ్జిట్పోల్స్లో వెల్లడించాయి.