హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) ‘కిడ్నీలు పాడయ్యాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం’ ఇలాంటి పిడుగులాంటి వార్త అప్పటివరకు సాఫీగా సాగుతున్న జీవితంలో వారి పరుగును ఆపేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని కాలరాస్తుంది. ఎన్నో లక్ష్యాలు.. మరెన్నో బాధ్యతలు.. జీవితమే ఆగిపోతుందని తెలిశాక ఆ క్షణాలను దాటడం నరకం. కిడ్నీలు ఫెయిలై జీవితమే ముగుస్తుందనుకున్న చాలామంది జీవితాల్లో ‘కిడ్నీ మార్పిడి’ చికిత్సలు వెలుగులు నింపుతున్నాయి. వైద్యులు ప్రసాదించే పునర్జన్మతో ఎంతోమంది జీవితంలో గొప్ప లక్ష్యాలను ఛేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నానక్రాంగూడలోని స్టార్ దవాఖానలో కిడ్నీ వారియర్స్కు ‘స్టార్ సెలబ్రిటీ’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో అవార్డుల గ్రహీతలు పునర్జన్మ ప్రసాదించిన వైద్యుల సేవలను తలచుకుని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ నెఫ్రాలజీ, ట్రాన్స్ప్లాంట్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీధర్, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
కిడ్నీ మార్పిడి చేసుకున్న వారి విజయగాథను అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిడ్నీ వారియర్స్ను స్టార్ సెలబ్రిటీ అవార్డులతో సత్కరించాం. చాలా మంది 90 శాతం కిడ్నీ ఫెయిల్ అయ్యాక దవాఖానకు వస్తున్నారు. స్టేజ్1, 2లో ఉన్నప్పుడు ఎలాంటి డయాలసిస్, మార్పిడి చేయాల్సిన పనిలేకుండా క్యూర్ చేయొచ్చు. – డాక్టర్ జీ శ్రీధర్, ఎండీ, డీఎం(నెఫ్రాలజీ),ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్, స్టార్ దవాఖాన
2013లో పంచాయతీ ఎలక్షన్స్ డ్యూటీ లో ఉండగా, కాలి మడిమ దగ్గర వాపు వచ్చింది. సీరం క్రియాటినైన్ లెవల్ పెరిగిందని వైద్యులు చెప్పారు. డాక్టర్ శ్రీధర్ను కలిసి, కిడ్నీ ఫెయిల్ అయిందని తెలుసుకున్నా. నా భార్య కిడ్నీ ఇవ్వడంతో 2014లో ఆపరేషన్ జరిగింది. పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ శ్రీధర్కు నేను రాసిన మానేరు గలగల పుస్తకాన్ని అంకితమిచ్చా. ఉర్దు కవి గుల్జార్ ‘గ్రీన్ ’ పుస్తకాన్ని ఆకుపచ్చ కవితలు పేరుతో అనువాదం చేశాను. దీనికి నాకు 2022లో కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది.