హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): పొగ తాగేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ.. ధూమపానంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. మధుమేహం వచ్చిన తర్వాత కూడా ధూమపానం కొనసాగిస్తే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది. మంగళవారం ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’ సందర్భంగా డబ్ల్యూహెచ్వో ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ధూమపాన అలవాటు లేనివారితో పోల్చితే పొగతాగేవారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ముప్పు 30-40 శాతం ఎక్కువని ఈ నివేదిక పేర్కొన్నది.
ధూమపానాన్ని మానేస్తే షుగర్ వ్యాధి వచ్చే ముప్పు కూడా 40 శాతం వరకు తగ్గుతుందని స్పష్టం చేసింది. మన శరీరంలోని పిత్తాశయం (పాంక్రియాస్)లో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి, నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయి. పొగతాగినప్పుడు 7 వేలకుపైగా రసాయనాలు శరీరంలోకి వెళ్తాయి. వీటిలో 69 రసాయనాలతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నదని, ముఖ్యంగా పిత్తాశయంలోని బీటా కణాల పనితీరును నికోటిన్ తీవ్రంగా దెబ్బతీస్తుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నదని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. దీని వల్ల పొగ తాగేవారికే కాకుండా వారి చుట్టూ ఉన్నవారికీ ముప్పు పొంచి ఉన్నదని పేర్కొన్నది.
పొగాకు వాడకం వల్ల రక్తనాళాల గోడలు మందంగా తయారై అడ్డంకులు ఏర్పడతాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు పొగాకు తాగితే హృదయ సంబంధ వ్యాధులు, ముఖ్యంగా గుండెపోట్లు పెరుగుతాయి. పొగాకు వాడకం ఫుట్ అల్సర్లను తీవ్రతరం చేస్తుంది. గాయాలు తొందరగా నయం కావు. దీనినే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దీనితోపాటు కంటి రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతిని చూపు మందగిస్తుంది. దీనినే డయాబెటిక్ రెటినోపతి అంటారు. మూత్రపిండాలు విఫలం కావడం, బ్రెయిన్ స్ట్రోక్స్, లింఫ్ అవయవాల విచ్ఛేదనం, చర్మ సంబంధ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, వినికిడి శక్తి తగ్గడం, నిద్రలేమి, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తాయని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది.
టైప్-2 డయాబెటిస్ లక్షణాలు నెమ్మదిగా బయటపడతాయని, కొన్నేండ్లపాటు ఈ వ్యాధిని గుర్తించలేమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాహం, ఆకలి పెరగడం, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం, బరువు వేగంగా తగ్గడం, విపరీతమైన అలసట, కంటిచూపు మందగించడం, గాయాలు నెమ్మదిగా తగ్గడం, తరుచూ ఇన్ఫెక్షన్లు రావడం, కాళ్లు, చేతులు పట్టేసినట్టు కనిపించడం, చర్మం ముదురు రంగులోకి మారడం, మెడ, చంకల్లో చర్మం నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ధూమపానంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. మధుమేహం వచ్చిన తర్వాత కూడా ధూమపానాన్ని కొనసాగిస్తే అగ్నికి ఆజ్యం పోసినట్టే. రక్తనాళాలు ధ్వంసమై గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా గుండెపోటు ముప్పు 10-15 రెట్లు పెరుగుతుంది. ఇది రోజురోజుకూ అధికమై జీవన కాలం తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చినవారు పొగ తాగడాన్ని మానేస్తే 3-4 ఏండ్లలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ ముప్పు తగ్గుతుంది. ఇందుకోసం వారు కఠిన ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామాలు చేయాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉన్నాయో లేదో చూసుకోవాలి.
– డాక్టర్ శరత్రెడ్డి, కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్