హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అమోఘమని ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతాదళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం కొనియాడాయి. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టడం గర్వకారణమని పేర్కొన్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసేందుకు మంగళవారం రవీంద్రభారతిలో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమకు సమతా సైనికదళ్ మార్షల్స్ సెల్యూట్ ఉంటుందని తెలిపాయి.
సభకు హాజరయ్యే వారంతా సిగ్నేచర్ బ్యానర్పై విధిగా సంతకం చేయాలని, ఆ బ్యానర్ను చరిత్రాత్మకమైన మహా విగ్రహావిష్కరణ రోజున ప్రదర్శిస్తామని వివరించాయి. సభకు ముఖ్య అతిథిగా యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్దేవ్ థోరట్, రాష్ట్ర మాజీ సీఎస్లు సోమేశ్కుమార్, కాకి మాధవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, డిక్కి జాతీయ అధ్యక్షుడు, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ నర్రా రవికుమార్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, అన్ని యూనివర్సిటీల వీసీలు హాజరుకానున్నట్టు తెలిపాయి. వీరితోపాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ మల్లయ్య భట్టు, ఐఎంఏ మాజీ చైర్మన్ డాక్టర్ ఈ ప్రతాప్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఏ అశోక్, గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఢిల్లీ వసంత్, ఎస్సీ ఎస్టీ నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం ఆరేపల్లి రాజేందర్ పాల్గొననున్నారు.