NIMS | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): డబ్బున్నోళ్లకు ఏదైనా క్లిష్టమైన ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్తారు. మరి పేదవారికి ఆ కష్టం వస్తే.. రాష్ట్రంలో ఆ స్థాయిలో వైద్యాన్ని అందించే ప్రభుత్వ దవాఖానలు గాంధీ, నిమ్స్, ఉస్మానియా మాత్రమే. వీటిల్లో నిమ్స్ దవాఖానది ప్రత్యేక స్థానం. అతి తక్కువ ఫీజుతో, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తూ ‘పేదల కార్పొరేట్’గా అవతరించింది. నిమ్స్ అసలు పేరు బొక్కల దవాఖాన. ఇప్పటికీ పాతతరం వాళ్లు బొక్కల దవాఖాన అంటే టక్కున గుర్తుపడతారు. దీనికి 1955లో బీజం పడింది. నిజాం ట్రస్ట్ కింద స్థలం కేటాయింపు జరిగింది. ‘నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్’ పేరుతో 1969 డిసెంబర్ 22న నిమ్స్ ప్రారంభమైయ్యింది. తొలి సూపరింటెండెంట్గా ఆర్థోపెడిక్ సర్జన్ ఎం రంగారెడ్డి వ్యవహరించారు. నిజాం ట్రస్ట్ ఈ దవాఖానను ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి అప్పగించే వరకు రంగారెడ్డి సూపరింటెండెంట్గా కొనసాగారు. సుమారు 70 ఏండ్ల చరిత్ర ఉన్న నిమ్స్ను వసతులు, సేవల పరంగా చూసినప్పుడు 2014కు ముందు.. 2014 తర్వాత అని స్పష్టంగా వర్గీకరించవచ్చు.
2009లో ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు నిమ్స్లోనే వైద్యం అందించారు. ఆనాటి నుంచి నిమ్స్తో సీఎం కేసీఆర్కు మంచి అనుబంధం ఉన్నది. నిమ్స్కు అన్ని రకాల హంగులు ఉన్నా.. అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే ఏటా రూ.100 కోట్లు కేటాయించి నిమ్స్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాటను అమల్లోకి తెస్తూ మొదటి ఏడాదే 2014-15లో రూ.185 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా నిమ్స్కు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. 2022లో నిమ్స్కు రూ.242 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.290 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇప్పుడు నిమ్స్ విస్తరణకు నడుం బిగించారు. 2000 పడకలతో నిర్మించబోతున్న ‘దశాబ్ది భవనాల’కు సీఎం కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో దేశంలో అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానగా నిమ్స్ ముందు వరుసలో నిలువన్నది.
నిమ్స్ దవాఖాన 2014కు ముందు అరకొర వసతులుతో కొట్టుమిట్టాడేది. తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశంలోనే అత్యుత్తమ దవాఖానల్లో ఒకటిగా మారింది. 2014 నాటికి దవాఖానలో 900 పడకలు మాత్రమే ఉండేవి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ సంఖ్యను 1489కి పెంచారు. అంటే స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే పడకల సంఖ్య 65% పెరిగింది. 2014 నాటికి 111 మంది బోధనా సిబ్బంది ఉండగా నిరుడు చివరినాటికి ఈ సంఖ్య 264కు పెరిగింది. రెసిడెంట్ డాక్టర్లు గతంలో ఏటా 82 మందిని కేటాయించగా, ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు.
నిమ్స్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలు అందిస్తున్నది. తొమ్మిదేండ్లలో లక్షన్నర మంది లబ్ధిపొం దారు. రూ.533 కోట్ల విలువైన ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు అందాయి. అవయవ మార్పిడులు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నారు. 2014లో 26 కోట్ల విలువైన సేవలు అందగా.. 2022-23 నాటికి 97 కోట్ల విలువైన సేవలు అందించింది.
నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం మూడు బ్లాకులు నిర్మించనున్నారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్లు ఏర్పాటుకానున్నాయి. ప్రస్తుతం నిమ్స్కు రోజుకు సగటున 2000-3000 ఓపీ నమోదవుతున్నది. ప్రస్తుత భవనం సామర్థ్యానికి ఇది చాలా ఎక్కువ. దీంతో కొత్త భవనంలో ప్రత్యేకంగా ఓపీ సేవల కోసమే ఒక బ్లాక్ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీ సేవలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా 8 అంతస్థుల్లో ఓపీ బ్లాక్ను నిర్మించనున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్థులతో బ్లాక్ను నిర్మిస్తున్నారు. ఇన్పేషంట్ల కోసం 13 అంతస్థులతో మరో బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు.
స్వరాష్ట్రంలో వసతులు పెరుగడంతో అవయవ మార్పిడులకు నిమ్స్ కేరాఫ్గా మారింది. కిడ్నీ, లివర్, గుండె వంటి అవయవాలు, ఎముక మజ్జ, కీళ్ల మార్పిడి, గూనిని సరిచేసే స్పైన్ డీఫార్మిటీ కరెక్షన్స్ ఆపరేషన్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇవన్నీ ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుండటం విశేషం. కేవలం సర్జరీతో ఆపకుండా వారికి జీవితాంతం అవసరమయ్యే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది.
సర్జరీ 2014 వరకు తొమ్మిది ఏండ్లలో
కిడ్నీ మార్పిడి 661 753
కాలేయ మార్పిడి 0 23
గుండె మార్పిడి 0 6
బోన్ మ్యారో 46 154
కీళ్ల మార్పిడి 134 1444
నిమ్స్ దవాఖానలో అదనంగా 2,000 పడకలతో ఏర్పాటు చేస్తున్న ‘దశాబ్ది బ్లాక్’కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో నిమ్స్ నాలుగు వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటళ్ల జాబితాలో చేరనున్నది. ప్రస్తుత తరంతోపాటు భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఇది.
– వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్
నేను సుమారు 33 ఏండ్లుగా నిమ్స్లో సేవలు అందిస్తున్నాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిమ్స్ దవాఖాన రూపురేఖలు మారిపోయాయి. ఏటా కావాల్సినన్ని నిధులు కేటాయిస్తూ నూతన భవనాలు, అత్యాధునిక వసతుల కల్పనతో రోగుల్లో నమ్మకం పెరిగింది. తొమ్మిదేండ్లలోనే నిమ్స్లో అందించే సేవలన్నీ దాదాపుగా డబుల్ అవడమే దవాఖానపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. ఇటీవలే ఎంసీహెచ్ నిర్మాణ పనులకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు భూమిపూజ చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ మరో 2 వేల పడకల భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో నిమ్స్లో పడకల సంఖ్య సుమారు 4వేలకు చేరనున్నది. కొత్త భవనాలతో మాపై బాధ్యత మరింత పెరుగుతుంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం.
– డాక్టర్ బీరప్ప, నిమ్స్ సూపరింటెండెంట్