హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఇటీవల తనతో పలు రాష్ట్రాల నాయకులు మాట్లాడారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత కొద్దిసేపు ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్చేశారని, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఉద్ధవ్ఠాక్రే తదితరులతో మాట్లాడానని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీపై బలమైన వ్యతిరేకత కనిపిస్తున్నదన్నారు. బీహార్ నాయకుడు, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్కు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నదని, అన్ని అంశాలపై అవగాహన పెంచుకొన్నారని, ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు తనను కలిశారని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. అంతకుముందు మీడియా సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా ప్రజలే ఫ్రంట్గా ఏర్పడుతరని, ప్రజలు ముందకు వస్తరని అన్నారు. ‘ఇది పీపుల్స్ ఫ్రంట్ కావాలి.. ఇది ఎక్స్, వై, జెడ్ ఫ్రంట్ కాదు. నేను ఇప్పటికే మమతా బెనర్జీతో మాట్లాడిన, దేశంలో అనేక మంది నాయకులున్నరు, ఉద్దవ్ఠాక్రేతో కూడ చర్చలు జరుగుతున్నయి. యూపీలో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీలో అసంతృప్తులు బయటకు వస్తాయి. ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కూడా బయటికి వస్తారు. రామానుజ కార్యక్రమం పూర్తయిన తరువాత ఏ సమయంలోనైనా ముంబై వెళతా. నాయకులు అభిప్రాయాలు పరస్పరం పంచుకోవాలి. చర్చించుకోవాలి. ఆ తరువాతే ప్రత్యామ్నాయం ఎలా ఉంటుందనేది తెలుస్తది. ఫ్రంట్ ఉంటదా? ఇంకొకటి ఉంటదా అనేది అందరం చర్చించిన తరువాతనే స్పష్టత వస్తుంది. అందులో నేను కీలక భూమిక పోషిస్తా’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ మరింత బలహీనం
ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత బీజేపీ క్రమేణా బలహీనపడడం ఖాయమని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీపార్టీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఉన్నదని, ఇప్పటివరకు తనవద్ద ఉన్న సమాచారం మేరకు 20-25 సీట్ల మార్జిన్తో బీజేపీ ముందంజలో ఉన్నదని, అయితే, తొలిదఫా ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో సమాజ్వాదీపార్టీకి మొగ్గు ఉన్నట్టు తెలిసిందని, ఇంకొన్ని రెండోదశ స్థానాల్లో కూడా సమాజ్వాదీకి మొగ్గు కనిపిస్తున్నదని అన్నారు. కొన్ని ప్రాం తాల్లో బీజేపీకి అనుకూలంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ చేస్తున్న ప్రచారం బీజేపీకి లాభం చేకూర్చవచ్చని, సుమారు రెండు లక్షల మందికిపైగా ఆర్ఎస్ఎస్ వాళ్లు యూపీలో బీజేపీ తరఫున పనిచేస్తున్నారని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ కనీసం 170 సీట్లు తెచ్చుకున్నా అఖిలేశ్ యాదవ్కు లాభమేనని, ఎప్పటికైనా అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో బలమైన నాయకుడిగా ఉంటాడని, బాగా చదువుకున్నాడని, మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. యూపీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ఓడిపోతే దాని ప్రభావం ఆ పార్టీపై దారుణంగా ఉంటుందన్నారు. ఇప్పటికే బీజేపీలో అంతర్గతంగా నాయకుల మధ్య పోరు ఉన్నదని, యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా చాలా త్వరగా బయటపడుతుందని పేర్కొన్నారు. యూపీలో మాయావతి పెద్దగా పోటీ ఇవ్వలేకపోతున్నారని, అయితే, బీఎస్పీకి ఉండే ఓట్లు, సీట్లు కాపాడుకొంటున్నారని చెప్పారు. బీఎస్పీ కీలక నేతలు, మాయావతి బంధువులపై బీజేపీ అనేకరకాలుగా ఒత్తిడి తెచ్చారని, వీటన్నింటికితోడు మాయావతి వయోభారంతో యాక్టివ్గా ఉండటం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతున్నదని చెప్పారు.
గెలువం కానీ పరిపాలిస్తం..ఇదీ బీజేపీ విధానం
ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి. ఓడిపోతే ఓటమిని అంగీకరించం. ఒప్పుకోం. గోల్మాల్ తిప్పుతం. పరేషాన్ చేస్తం. ఈడీ పెడ్తం. సీబీఐ పెడ్తం. గిదాపద్ధతి? బీజేపీది అప్రజాస్వామిక విధానం. ప్రజా తీర్పులను గౌరవించే కనీస సంస్కారం లేనిది నరేంద్రమోదీకి, బీజేపీ ప్రభుత్వానికి. వాజపేయి నాయకత్వం ఉన్నప్పుడు జనం బీజేపీని కొద్దిగ నమ్ముదురు. ఇప్పుడంతా గంగల కలిపిండ్లు. భారతదేశం సాక్షిగా.. మనందరి సాక్షిగా.. ఎన్నికల్లో గెలువకున్నా పరిపాలిస్తరు. ఎట్లా పరిపాలిస్తరు? దేశంలో సిగ్గులేని ఒకే ఒక పార్టీ బీజేపీ. సిగ్గూ ఎగ్గూ లేదు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాలో గెలువలేదు. కానీ నిన్నటిదాకా పరిపాలించిండ్లు. మణిపూర్, మహారాష్ట్రలో గెలవలే కానీ మబ్బుల మూడుగొట్టంగ.. దొంగలెక్క ప్రమాణ స్వీకారం చేయించారు. వాళ్లు తిరగబడితే ఎల్లెల్కల పడి సిగ్గు, మానం తీసుకున్నరు. మహారాష్ట్రలో ఘోరంగా బీజేపీకి దెబ్బలు పడ్డది నిజం కాదా? మహారాష్ట్రలో బీజేపీ ఆడిన నాటకంపై చర్చ పెడదమా? ఇది మంచిపద్ధతేనా? ఓటమిని అంగీకరించే సహనం రాజకీయాల్లో ఉండాలె. ఒకసారి ఓడిపోతాం. ఒకసారి గెలుస్తాం. గెలిచినంత మాత్రాన గర్వమెందుకు? ఓడినంత మాత్రాన అసహన వైఖరి ఎందుకు? భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనా ఈ దేశం బాగుపడేది? అప్రజాస్వామికంగా మోదీ పాలిస్తున్నరు. ప్రజాస్వామ్యం మీద బీజేపీకి విలువలేదు. గౌరవం లేదు. సిగ్గులేని ప్రభుత్వం మోదీది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసింది బీజేపీ. బీజీపే ఇలా ఎందుకు చేసిందో దేశానికి సమాధానం చెప్పాలె. కర్ణాటకలో ఏం చేశారు? ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వకున్నా.. ఎందుకు గుంజుకున్నారు? అధికారం మీద అంత ఆకలి ఎందుకు? ఇది చెడు సంస్కారం కాదా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనిపై ఎందుకు చర్చపెట్టకూడదు? ఏది పడితే అది చేస్తాం. గోల్మాల్ చేస్తాం. వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడతాం. వేరే మార్గంలో చెప్తాం. అందమైన రంగుల్లో అబద్ధాన్ని ప్రచారం చేస్తాం. ఇదా పద్ధతి?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చూస్తుంటే జాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను చూస్తే జాలేస్తున్నది. ఆయనకు ఏదీ తెలిసినట్టు లేదు. ఆయనకు బదులు వేరేవాళ్లతో మాట్లాడిస్తే బెటర్. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతారా? ప్రతివాళ్లు ఇదే పద్ధతిలో ప్రతి విషయంలో దారుణమైన అబద్ధాలు, మోసాలు చెప్తున్నరు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నరు. వందశాతం ఇది నిజం. పార్లమెంటరీ రిపోర్టులు, మంత్రుల ఉత్తరాలు, శాసనసభ తీర్మానాలు, శ్రీకాకుళంలో బిగించిన మీటర్లు వాస్తవం కాదా? శ్రీకాకుళంలో 25 వేల మీటర్లు బిగించింది అబద్ధమంటవా? ఇవన్నీ ఝూటానా? ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇట్ల మాట్లాడవచ్చా? ఇవన్నీ అబద్ధాలేనా? నివేదికలు, స్టాండింగ్ కమిటీ రిపోర్టులపై చర్చ పెట్టండి. గాలి మాటలు మాట్లాడటం కాదు. ఇన్ని అబద్ధాలు చెప్పేవాళ్లను మీడియా మిత్రులు చీల్చి చెండాడాలి. శ్రీకాకుళంలో 25 వేల మోటర్లకు మీటర్లు పెట్టారు, మిగతా వాటికి టెండర్లు పిలిచారు, దీన్ని అమలు చేస్తున్న రాష్ర్టాలకు 0.5 ఎఫ్ఆర్బీఎం ఇస్తున్నరు, బడ్జెట్లో కూడా పెట్టారు, ఇందుకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం ఉన్నది. నేను రాసిన లేఖ ఉన్నది. మోటర్లకు మీటర్లకు పెడుతున్నారని చెప్పేందుకు ఇన్ని సాక్ష్యాలు కండ్ల ముందు కనిపిస్తున్నా మీటర్లు ఎక్కడ పెట్టుమన్నరు అంటూ బుకాయిస్తున్నరు. వాళ్లు పెట్టుమనందే జగన్మోహన్రెడ్డి పెట్టాడా? శ్రీకాకుళం జిల్లాల ఎందుకు పెట్టారు? మీటర్లు పెట్టుమనందే ఎఫ్ఆర్బీఎంలో 0.5 శాతం ఇస్తున్నరా? దాన్ని మేం ఎందుకు తీసుకోవడం లేదు? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నం కాబట్టి తీసుకోవడం లేదు. ఇంత ఘోరమైన అబద్ధాలు చెబుతున్నరు. మీటర్లు పెట్టుమనడం వేరు, బలవంతపెట్టడం వేరు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి చదువు వస్తదో రాదో తెలియదు, చదివిన కాగితం అర్థమైతదో కాదో తెలియదు పాపం గరీబ్గాడు. ఆయనను చూస్తుంటే నాకు నిజంగానే జాలేస్తున్నది. ఆయన మాట్లాడితే రోజురోజుకు ఆ పార్టీ పరువు పోతున్నది. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ వేడుకోవాలి.