హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగతు రహిత ఆరోగ్య పథకాన్ని(EHS) అమలుకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావుకు, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 1 శాతం చందాతో కూడిన నగతురహిత వైద్య సహాయాన్ని ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం కోరిన సంగతి తెలిసిందే. దీంతో 6.50 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ కుటుంబాలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ అసెంబ్లీ సాక్షిగా హరీశ్రావు ప్రకటించడం గొప్ప విషయమన్నారు.
ఎన్నో ఏండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం ఎదురుచూసినప్పటికీ సాధ్యం కాలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. కేసీఆర్కు ఉద్యోగులపై ఉన్న అమితమైన ప్రేమతో ఈహెచ్ఎస్ పథకాన్ని అమలుచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నూతన ఈహెచ్ఎస్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు వెంటనే విడుదల చేస్తామన్నారు. భారతదేశంలోనే తెలంగాణ ఈహెచ్ఎస్ పథకం గొప్పగా అమలు చేద్దామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్తో పాటు ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ముజూబ్, విక్రమ్, లక్ష్మణ్(రంగారెడ్డి), పరమేశ్వర్, విక్రమ్ రెడ్డి(సిద్దిపేట) తదితరులు పాల్గొన్నారు.