హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవో కోశాధికారి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను, అలియాస్ తెలంగాణ శ్రీను ఆదివారం మృతిచెందారు. గతంలో బ్రెయిన్ స్ట్రోక్కు గురవడంతో కంచన్బాగ్లోని అపోలో హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన కొన్నాళ్లు కోమాలోకి వెళ్లారు. కాగా ఆదివారం చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. టీఎన్జీవో యూనియన్లో చాలామంది అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మారినా ఆయన మాత్రం కోశాధికారిగా సేవలందిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ముఖంపై బొట్టుతో కనిపించే ఆయనను తోటి ఉద్యోగులు బొట్టు శీనన్న అని ప్రేమగా పిలుచుకునేవారు. రామినేని శ్రీనివాస్రావు అకాలమరణం పట్ల పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, మాజీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంతాపం తెలిపినవారిలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ, సహ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, సహ అధ్యక్షుడు బీ శ్యామ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కురాడి శ్రీనివాస్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, కొండూరు గంగాధర్, మామిడి ప్రభాకర్, క్రాంతికిరణ్, చక్రధర్, ఈ కిరణ్రెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీప్రసాదరావు, టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు కారం రవీందర్రెడ్డి, కే శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం : కేసీఆర్
హైదరాబాద్, మార్చి9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఎన్జీవో స్టేట్ ట్రెజరరీగా, ప్రభుత్వ ఆబారీశాఖలో సూపరింటెండెంట్గా రామినేని శ్రీనివాస్ అందించిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. రామినేని మృతి పట్ల ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్ మృతి విచారకరమని.. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.
తెలంగాణకు తీరని లోటు మాజీ మంత్రి హరీశ్రావు
కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో పోరాడిన ఉద్యమసహచరుడు, తెలంగాణ ఎన్జీవో రాష్ట్ర కోశాధికారి, ఆబారీ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేసిన రామినేని శ్రీనివాసరావు మరణం తెలంగాణకు తీరనిలోటని మాజీ మంత్రి హరీశ్రావు వాపోయారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం అనిర్వచనీయమని కొనియాడారు. ఆయన మృతి ఉద్యోగ సంఘాలకే కాదు.. తెలంగాణకు తీరనిలోటని, మంచి ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధాకరం ; బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
శ్రీనివాసరావు మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు. ఉద్యమ కాలంలో శ్రీనివాసరావుతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలతోపాటు, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కేటీఆర్ స్మరించుకున్నారు. ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధాకరమని వాపోయారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస్రావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.