తెలంగాణచౌక్, సెప్టెంబర్ 14 : ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్ రుణపడి ఉంటామని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ తెలిపారు. ఎన్ని ఆంటకాలు ఎదురైనా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం విలీనం చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం కరీంనగర్ డిపో-1 ఎదుట ఉద్యోగులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. పటాకలు కాల్పి, స్వీట్లు పంపిణీ చేశారు.
‘కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినదించారు. అంనతరం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని సాహసోపేత నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని కొనియాడారు. ఎన్నో ఏండ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదురు చూస్తున్న ప్రభుత్వంలో విలీనం కోరికను ముఖ్యమంత్రి నెరవేర్చడం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. సమైక్య పాలనలో కార్మికులకు చాలీచాలని జీతాలు వచ్చేవని, వెట్టి చాకిరీ చేయించి ఎన్నో ఇబ్బందులకు గురి చేశాయని గుర్తు చేశారు.
స్వరాష్టంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆర్టీసీకి మొదటి దఫాలో రూ. 500 కోట్లు, మరోసారి రూ.1500 కోట్లతో పాటు బడ్జెట్ రూ.500 కోట్లు కేటాయిచి ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు తెలిపారు. కరోనా సమయంలో ఒక్క బస్సు కూడా తిరగకున్నా, ఆదాయం లేక త్రీవ ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడినా ఉద్యోగులకు మాత్రం నెల వారీగా జీతాలను అందించి, వారి కుటుంబాలను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని కుట్రలు చేసిందని థామస్ మండిపడ్డారు. అందులో భాగంగా 2019 నూతన రవాణా చట్టాన్ని తీసుకొచ్చి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని విమర్శించారు. కానీ, సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆర్టీసీని కాపాడుకుంటామని ఉద్యోగుకుల ఇచ్చిన హామీ మేరకు కేంద్ర అందిస్తామన్న రూ.వెయ్యి కోట్ల గ్రాంటును వదలుకొని ఉద్యోగులు భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వంలో విలీన ప్రకియ చేపట్టిన మహా నాయకుడని కొనియాడారు.
కొన్ని కుహనా సంఘాలు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకుండా అడ్డుకోవాలని కుట్రలు చేశాయని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఉద్యోగులు నిజాలను గ్రహించాలని కోరారు. సీఎం కేసీఆర్ పూర్తి విశ్వాసం ఉందని, ఎప్పటికైనా ఆర్టీసీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతారని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలకు సేవలందిండమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. సమావేశంలో టీఎంయూ నాయకులు మనోహర్, శంకర్, జీపీ సింగ్, ఏవీఆర్ రెడ్డి, సాగర్ పాల్గొన్నారు.