హైదరాబాద్/చిక్కడపల్లి, ఆగస్టు 10 (నమస్తేతెలంగాణ): తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు గురువారం విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును కలిశారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో విధివిధానాల రూపకల్పన, ఉద్యోగుల కేటాయింపు తదితర వాటి గురించి ఆయనతో చర్చించారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వర్రావుని కలిసి మరిన్ని విషయాలపై ఆరా తీశారు. ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రావును కలిసి విలీనం, తదనంతర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఏఆర్రెడ్డి, థామస్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఆర్టీసీ విలీనం సందర్భంగా అనుసరించిన విధివిధానాలపై అధ్యయనం చేసినట్టు తెలిపారు. సేకరించిన సమాచారం ఆధారంగా అవసరమైన మార్పు చేర్పులతో సమగ్ర నివేదిక రూపొందించి ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాక ఆర్టీసీ దవాఖానాలో పూరిస్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నారు. స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీంలో ప్రతి కార్మికుడి వేతనం నుంచి నెలకు రూ.250 చెల్లిస్తే.. పదవీ విరమణ తర్వాత నెలకు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు పెన్షన్ లభిస్తోంది. ఏపీలో ఆర్టీసీ విలీనం తర్వాత ఈ సౌకర్యాలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఉచిత వైద్యం స్థానంలో రూ.4 లక్షల హెల్త్కార్డును అందిస్తోంది. ఉద్యోగ భద్రత విషయంలో ఏపీలో అమలు చేస్తున్న విధానాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని కోరుతున్నారు. ఏపీలో డ్రైవర్, కండక్టర్లు విధి నిర్వహణలో మొదటి సారి తప్పు చేస్తే రూ.10 నుంచి రూ.100 జరిమానా విధిస్తున్నారు. రెండోసారి ఏడాది పాటు నెలకు రూ.100 చొప్పున జరిమాన, ఏడాది ఇంక్రిమెంట్ కోత విధిస్తున్నారు. మూడోసారి తప్పు చేస్తే ప్రతి నెల రూ.100 జరిమానా, రెండు ఇంక్రిమెంట్ల కోత విధిస్తున్నారు. ఇలాంటి విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని టీఎంయూ నేతలు భావిస్తున్నారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కమలాకర్గౌడ్, కోశాధికారి రాఘవరెడ్డి, ముఖ్య సలహాదారులు యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి నరేందర్, కరీంనగర్ జోనల్ నాయకులు పుప్పాల శంకర్, కస్తూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.